Aazad hind party : నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Nethaji Subhash Chandrabose) వారసత్వం రాజకీయ వేదికపైకి రాబోతున్నది. బోస్ మునిమనవడు చంద్రకుమార్ బోస్ (Chandra Kumar Bose) కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ‘ఆజాద్ హింద్ పార్టీ (Aazad hind party)’ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. యువతను ప్రధాన బలంగా చేసుకుని నేతాజీ అనుసరించిన సమ్మిళిత, లౌకిక భావజాలంతో ముందుకు సాగుతామని చెప్పారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన జెన్-జీ నిరసనలు తన నిర్ణయానికి ప్రధాన కారణమని చంద్రకుమార్ బోస్ తెలిపారు. నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వాలు, వ్యవస్థలపై యువతలో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా రాజకీయాలు, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు సహా పలు రంగాల్లో అవినీతి పెరిగిందని బోస్ ఆరోపించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై విసిగిపోయిన యువతకు తమ హక్కుల కోసం పోరాడేందుకు ప్రత్యేక రాజకీయ వేదిక అవసరమని చెప్పారు.
అందుకే నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో స్ఫూర్తి పొందిన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. చంద్రకుమార్ బోస్ 2016లో బీజేపీలో చేరారు. ఏడేళ్లపాటు ఆ పార్టీలో కొనసాగారు. నేతాజీ సిద్ధాంతాల ప్రచారం కోసం ‘ఆజాద్ హింద్ మోర్చా’ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు. బీజేపీలో చేరడం తన తప్పిదమని గతంలో వ్యాఖ్యానించారు. 2026 ఏప్రిల్లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీలో చేరారు.
నేతాజీ భావజాలంపై పనిచేసే అవకాశం ఉంటుందని భావించినట్లు తెలిపారు. అయితే నాలుగు నెలలకే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆగస్టు 3న వ్యక్తిగత కారణాలతో తప్పుకొంటున్నట్లు మమతా బెనర్జీకి లేఖ రాశారు.