కోల్కతా : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజైన జనవరి 23న జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని, తద్వారా దేశం మొత్తం నివాళులర్పిస్తుందని బెంగాల్ సీఎం మమత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే దేశ్నాయక్ జయంతిని ఘనంగా నిర్వహించాలని ప్రజలకు సైతం పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు మమతా బెనర్జీ గణతంత్ర దినోత్సవ పరేడ్లో బెంగాల్ శకటాన్ని నిరాకరించడంపై ప్రధానికి లేఖ రాశారు. సుభాష్ చంద్రబోస్ 125వ శకటాన్ని బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించింది, ఎలాంటి కారణాలు తెలుపకుండా అనుమతి నిరాకరించడం దిగ్భ్రాంతి కలిగించిందని, కేంద్రం నిర్ణయంతో షాక్కు గురయ్యానని లేఖలో పేర్కొన్నారు.
ఇవాళ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. నేతాజీ విగ్రహం చిత్రాన్ని ట్వీటూ చేస్తూ ఈ విషయాన్ని ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. నేతాజీ విగ్రహం సిద్ధమయ్యే వరకు ఆయన హోలోగ్రామ్ విగ్రహం అదే స్థలంలో ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఇండియా గేట్ వద్ద 25 అడుగుల ఎత్తయిన నేతాజీ విగ్రహాని ఏర్పాటు చేయనున్నట్లు నేషనల్ మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్ డైరెక్టర్ జనరల్ అద్వైత్ గడ్నాయక్ పేర్కొన్నారు. గ్రానైట్ రాయితో విగ్రహాన్ని చెక్కనున్నట్లు పేర్కొన్నారు. విగ్రహానికి అవసరమైన రాయిని తెలంగాణ నుంచి తెస్తామని, విగ్రహం డిజైన్ను సాంస్కృతిక శాఖ సిద్ధం చేసిందని తెలిపారు. ప్రధాని ప్రకటన తర్వాత విగ్రహ తయారీ ప్రక్రియ ప్రారంభమైందని గడ్నాయక్ వివరించారు.