హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): భూతాపం పర్యావరణానికి పెను ముప్పుగా మారిందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ జయంత్ సిన్హా అన్నారు. దాన్ని 1.5 డిగ్రీలకు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇంతకన్నా ఎక్కువ భూతాపం కోలుకోలేని పర్యావరణ నష్టాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2070 నాటికి నెట్ జీరో సాధించాలన్న భారత సంకల్పానికి పలు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. హరిత భవనాలు, హరిత పర్యావరణానికి ఉద్దేశించిన గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-2021 సదస్సును గురువారం భారత్లోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ వర్చువల్గా ప్రారంభించారు.
‘నెట్ జీరో బిల్డింగ్స్ అండ్ బిల్డ్ ఎన్విరాన్మెంట్’ అంశంపై చర్చలో భాగంగా.. నెట్ జీరో సాధించేందుకు విద్యుత్తు ఉత్పత్తికి ఉపయోగించే ఇంధనంలో అత్యవసర మార్పులు చేయాల్సి ఉన్నదని జయంత్ సిన్హా చెప్పారు. మనం పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తికి మారాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు. రవాణా వ్యవస్థ పూర్తిగా విద్యుత్తుతో పాటు తక్కువ కాలుష్యం వెదజల్లే ఇంధనాలవైపు మళ్లాలని, పరిశ్రమల్లో గ్రీన్ హైడ్రోజన్ను ప్రోత్సహించాలని సూచించారు. అలెక్స్ ఎల్లిస్ మాట్లాడుతూ ప్రపంచాన్ని నెట్ జీరో మార్గంలో నడిపేందుకు గ్లాస్కోలో జరిగిన కాప్-26 ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. ప్రపంచంలోని 90 శాతానికిపైగా ఆర్థిక వ్యవస్థలు నెట్ జీరోను సాధించేందుకు కట్టుబడి ఉన్నాయని అన్నారు. సదస్సులో సీఐఐ మాజీ అధ్యక్షుడు జంషీద్ గోద్రేజ్, ఐజీబీసీ చైర్మన్ వీ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.