లక్నో: ముగ్గురు భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఒకరు మరణించగా మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదు. ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని భూమిదాన్ రాఘవ్పురి తిల్లా చార్ గ్రామానికి చెందిన గోవింద్ సింగ్, గుర్మీత్ సింగ్, పప్పు సింగ్ అనే ముగ్గురు నేపాల్ సరిహద్దు పట్టణమైన కాంచన్పూర్లోని బెలోరి మార్కెట్లో గురువారం జరిగే సంతకు వెళ్లారు. అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వీరిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది.
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గోవింద్ సింగ్ (24) బెలోరి ప్రాథమిక ఆసుపత్రికిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆయన మృతదేహం నేపాల్ పోలీసుల ఆధీనంలో ఉన్నది. మరోవైపు గుర్మీత్ సింగ్, పప్పు సింగ్ ఆచూకీ తెలియలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు పిలిభిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు సరిహద్దులో పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నదని పిలిభిత్ ఎస్పీ జై ప్రకాశ్ యాదవ్ తెలిపారు. ముందు జాగ్రత్తగా సరిహద్దు గ్రామంలో పోలీసులను మోహరించినట్లు చెప్పారు. ఏం జరిగిందన్నది తెలుసుకునేందుకు నేపాల్ పోలీస్ అధికారులను సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు.