ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే నిర్వహిస్తామని కేంద్రం హామీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీ రిజర్వేషన్ల అంశంపై తీర్పు వెలువరించే వరకు నీట్-పీజీ కౌన్సెలింగ్ను నిర్వహించబోమని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది. కేంద్రం హామీని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన బెంచ్ రికార్డ్ చేస్తూ.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ను ప్రారంభిస్తే కనుక విద్యార్థులు తీవ్ర సమస్యల్లో పడుతారని పేర్కొంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నీట్-పీజీ ఆలిండియా కోటా సీట్లలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్కు (ఆర్థికంగా బలహీన వర్గాలకు) 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జూలై 29న మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ పలువురు నీట్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే తీర్పు వెలువడే సమయానికి అడ్మిషన్ల ప్రక్రియ మొత్తం పూర్తయిపోతుందని, ఇది విద్యార్థులకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది అర్వింద్ దత్తర్ పేర్కొన్నారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పు చెప్పే వరకు పీజీ-నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించబోమని కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) కేఎం నటరాజ్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కావలసి ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు అర్హతగా వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలని ఎలా నిర్ణయించారని ఇటీవల కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.