భోపాల్ : ఆఫ్రికా నుంచి భారత్కు తెచ్చిన చీతాల్లో నెల వ్యవధిలోనే రెండు చీతాలు మృతి చెందాయి. దీంతో భారత్ వాతావరణం వాటికి సరిపడక మరణించాయంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై చీతా ప్రాజెక్టులో పనిచేసిన వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ (డబ్ల్యూఐఐ) మాజీ డీన్ యద్వేంద్ర విక్రమ్సిన్హ్ జాల మాట్లాడుతూ చీతాలకు సరిపడా స్థలం లేకపోవడం వల్లే అవి మృతి చెందాయని అభిప్రాయపడ్డారు. చీతాల పునఃప్రవేశ ప్రాజెక్టులో భాగంగా చీతాల సంఖ్యను పెంచాలన్న ప్రధాన ఉద్దేశంతో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) వాటిని ఇక్కడకు తేవడానికి ఆతృత చూపిందే తప్ప వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
చీతాల్లో కొన్ని మరణించడానికి గల కారణాలపై చర్చించడానికి ఎన్టీసీఏ సోమవారం అధికారులతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. దీనిపై జాల మాట్లాడుతూ చీతాల సంచారానికి కునో నేషనల్ పార్కు సరిపోదని తెలిపారు. 750 చదరపు కిలోమీటర్ల పరిధి వీటి ఆవాసానికి ఎంతమాత్రం సరిపోదు. ఒకటి రెండింటిని మాత్రమే పెంచి, ఒకచోటి నుంచి మరోచోటుకు తరలించే ఒకే జాతికి చెందినా ప్రాదేశికంగా వేరు చేసిన జీవులు కలిగి ఉండే విధానంలో వాటిని పెంచాలని ఆయన సూచించారు.