మహారాష్ట్ర గవర్నర్కు అజిత్ పవార్ చురకలు
పుణె, మార్చి 6: కొందరు గొప్ప హోదాల్లో ఉండి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారిని ఉద్దేశించి ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఆదివారం పుణెలోని ఎంఐటీ కాలేజీ గ్రౌండ్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధాని మోదీ, మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారి, అజిత్ పవార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవార్.. ‘నేను ఒక విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకురాదల్చుకొన్నా. కొందరు వ్యక్తులు ముఖ్యమైన పదవుల్లో ఉండి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ మహారాష్ట్ర, ఇక్కడి ప్రజలు అంగీకరించరు’ అని వ్యాఖ్యానించారు. సమర్థ రామదాసు లేకపోయి ఉంటే శివాజీ ఉండేవాడు కాదని కోశ్యారి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవార్ ఈ ఘాటు విమర్శలు చేశారు.