‘గ్యాంగ్స్టర్ నయీం జీవితంలోని మంచి చెడులను ఆవిష్కరిస్తూ రూపొందించిన చిత్రమిది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అతడు ఎలా గ్యాంగ్స్టర్గా ఎదిగాడో రియలిస్టిక్గా చూపించాం’ అని అన్నారు వశిష్టసింహ. ఆయన టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘నయీం డైరీస్’. దాము బాలాజీ దర్శకుడు. ఈ నెల 10న ఈ చిత్రం విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో వశిష్టసింహ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ సినిమాను అంగీకరించే వరకు నయీం గురించి నేను ఎప్పుడూ వినలేదు. అతడో గ్యాంగ్స్టర్ అనే విషయం తెలియదు. దర్శకుడు చెప్పిన కథ వినగానే సమాజంలో ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారా అనే భావన కలిగింది. సవాల్గా భావించి ఈ సినిమా చేశా.
ఈ పాత్ర కోసం నయీం ఇంటర్వ్యూలతో పాటు అతడి గురించి పత్రికల్లో వచ్చిన కథనాల్ని చదివా. గెరిల్లా పోరాటాల కోసం నక్సలైట్స్ చేసే వ్యూహరచన గురించి తెలుసుకొని నటించా. నయీం జీవిత కథలో నటించడం వల్ల వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నాకు ఇబ్బందులు వస్తాయనే భయం ఏ రోజులేదు. కాంట్రవర్సీల గురించి ఆలోచించలేదు. నయీం పాత్రకు న్యాయం చేయగలనా? లేదా? అన్న చాలెంజ్ మాత్రమే ఉండేది. నయీం జీవితంలోని తప్పొప్పులు.. అతడి విచక్షణ, చావుపట్ల దృక్పథాన్ని ఇందులో చూపించాం. కన్నడంలో 25 సినిమాలు చేశా. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం నాకు ఇష్టం. ఎలాంటి పరిమితులు లేకుండా నటనాపరంగా నాలోని భిన్నపార్శాల్ని ఆవిష్కరించే అవకాశం విలన్ పాత్రల్లోనే ఎక్కువగా దొరుకుతుందని నమ్ముతుంటా. ప్రస్తుతం తెలుగులో ‘ఓదెల రైల్వేస్టేషన్’, ‘సింబా’తో పాటు మరో రెండుసినిమాలు చేస్తున్నా. కన్నడంలో ‘కేజీఎఫ్-2’లో కీలక పాత్ర చేశా. మరికొన్ని సినిమాలు సెట్స్పై ఉన్నాయి’ అని తెలిపారు.