కొచ్చి: రెండు అత్యాధునిక యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నిపున్, ఐఎన్ఎస్ నిస్తార్లు ఇండియన్ నేవీలో చేరాయి. కేరళలోని కొచ్చిలో ఇవాళ జలప్రవేశ కార్యక్రమం జరిగింది. దీంట్లో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ పాల్గొన్నారు. డైవింగ్ సపోర్ట్ వెసల్స్(డీఎస్వీలు)గా పిలువడే ఐఎన్ఎస్ నిపున్, ఐఎన్ఎస్ నిస్తార్లు నేవీని మరింత బలోపేతం చేయనున్నాయి. నిస్తార్, నిపున్ల రాకతో భారత షిప్పింగ్ ఇండస్ట్రీ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని నేవీ చీఫ్ హరి కుమార్ తెలిపారు. ఇదే కొచ్చిలో కొన్ని రోజుల క్రితం స్వదేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ను జలప్రవేశం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నౌకల రాకతో భారత నేవీ బిల్డర్స్ నేవీగా మారిందన్నారు. పలు రకాల ఆపరేషన్స్ చేపట్టే సామర్థ్యం ఈ నౌకలకు ఉందని ఆయన అన్నారు. గతంలో నిస్తార్ను సబ్మెరైన్ రెస్క్యూ వెసల్గా వాడారు. 1971లో నిస్తార్ డైవింగ్ ఆపరేషన్స్ చేపట్టింది. పాక్ నేవీ సబ్మెరైన్ ఘాజీపై నిస్తార్ అటాక్ చేసింది.