భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకంతో జాతీయ స్థాయి హాకీ ప్లేయర్కు నిలువ నీడలేకుండా పోయింది. అక్రమ నిర్మాణాల్లో భాగంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రభుత్వం పలు నిర్మాణాలను కూల్చివేస్తున్నది. మంద్సౌర్లో నివాసముంటున్న 18 ఏండ్ల యువ హాకీ ప్లేయర్ సాగు డాబర్ ఇంటిని ప్రభుత్వ అధికారులు సోమవారం కూల్చివేశారు. ప్రత్యామ్నాయం చూసుకునే వరకు ఆగాలని వేడుకున్నా.. వినకుండా కూల్చివేశారని డాబర్ కన్నీటి పర్యంతమైంది. దీనిపై ఆమె స్పందిస్తూ ‘స్థానిక అధికారులు ఒక్కసారిగా వచ్చి మా ప్రాంతంలో ఉన్న ఇండ్లను ఉన్నఫళంగా కూల్చివేయడం మొదలుపెట్టారు. కొన్నేండ్ల నుంచి ఇక్కడ మేము నివాసం ఉంటున్నాం. సమయమివ్వాలంటూ వారిని కోరినా వినకుండా కూల్చేశారు. పేదవాళ్లం కాబట్టే మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారు. నా కుటుంబం కోసం ప్రత్యామ్నాయం చూపే వరకు మేము ఇక్కడే ఉంటాం’ అని డాబర్ వాపోయింది. ఇదిలా ఉంటే స్థానిక అధికారి బిహారి సింగ్ వివరణ మరోలా ఉంది. విద్యాశాఖ పరిధిలో ఉన్న స్థలాన్ని ఆక్రమించుకుంటూ కట్టిన ఇండ్లను కూల్చివేశామని పేర్కొన్నాడు. ఖాళీ అయిన స్థలంలో యువ ప్లేయర్ల కోసం కొత్తగా స్పోర్ట్స్ హాస్టల్ను నిర్మిస్తామని తెలిపాడు.