న్యూఢిల్లీ: ఢిల్లీలో పాఠశాల విద్యార్థినిపై జరిగిన యాసిడ్ దాడి ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (నేషనల్ కమిషన్ ఫర్ విమెన్) విచారణ చేపట్టింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్కు చెందిన ఓ బృందం.. బాధితురాలు చికిత్స పొందుతున్న సఫ్దర్జంగ్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ యాసిడ్ దాడి ఘటనపై బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకుంది.
ఈ కేసులో విచారణ జరిపి బాధితురాలికి అవసరమైన ప్రతి సాయం అందజేస్తామని మహిళా కమిషన్ పేర్కొన్నది. ఢిల్లీలోని ద్వారక జిల్లాలో ఇవాళ ఉదయం పాఠశాలకు వెళ్తున్న ఓ 17 ఏండ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగింది. ఇద్దరు బాలురు ముఖాలకు ముసుగులు వేసుకుని వచ్చి తన అక్కపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు బాధితురాలి చెల్లెలు చెబుతున్నది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.