హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ మరో జాతీయస్థాయి క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. ఏకాగ్ర అకాడమీ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 14వ తేదీ నుంచి ఆల్ ఇండియా ఫిడే టోర్నీ ప్రారంభమవుతుంది. ఓపెన్ క్యాటగిరీతో పాటు ఎలో రేటింగ్ 1600 కంటే తక్కువ ఉన్న ప్లేయర్లు పోటీపడేలా మరో టోర్నీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియం వేదికగా సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డితో పాటు చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే స్థానిక కోట్లా విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వేదికగా ఈ జాతీయ చెస్ టోర్నీలో ప్రైజ్మనీ రూ.21 లక్షలుగా నిర్వాహకులు ప్రకటించారు. ఆసక్తి ఉన్న ప్లేయర్లు ఐదు వేల ఎంట్రీ ఫీజుతో www.ekagrachessacademy.comలో సంప్రదించవచ్చని తెలిపారు.