ఖైరతాబాద్, జనవరి 1: ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్ను గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నుంచి నిర్వహించనున్నట్లు భారత ఆర్చరీ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చందుల్కర్ తెలిపారు. శనివారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈగ సంజీవ రెడ్డి, ఉపాధ్యక్షులు టి. రాజుతో కలిసి వివరాలు వెల్లడించారు. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ర్యాంకింగ్ టోర్నమెంట్ 2003లోనే ప్రారంభించామన్నారు.
గతంలోనూ హైదరాబాద్ నగరంలోని వివిధ మైదానాల్లో టోర్నమెంట్ నిర్వహించామని తెలిపారు. ఆర్చరీ తెలంగాణ అసోసియేషన్ అనిల్ కామినేని పోటీల నిర్వహణకు అనేక సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారన్నారు. నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్స్కు మొదటిసారిగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) స్పాన్సర్ చేస్తుందన్నారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ (రికర్వ్, కాంపౌండ్) విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
అసోసియేషన్ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన సబ్ జూనియర్స్ నేషనల్ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన క్రీడాకారిణి చైత్ర రజిత పతకం సాధించారని గుర్తు చేశారు. గచ్చిబౌలిలో నిర్వహించనున్న ఈ పోటీలను ఆదివారం రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ రావు గౌడ్ ప్రారంభిస్తారన్నారు. సమావేశంలో తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ కోశాధికారి పుట్ట శంకరయ్య, హైదరాబాద్ జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అర్వింద్, ఎన్టీపీసీ సీనియర్ మేనేజర్ సదరన్ రీజియన్ హెడ్క్వార్టర్స్ సహదేవ్ సేతి పాల్గొన్నారు.