Nara Lokesh | తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలం మునికూడలి పుష్కర ఘాట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడైన నారా దేవాన్ష్ పేరు పెట్టాలనే ప్రతిపాదనపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సుమారు కోటి రూపాయల వ్యయంతో ఈ ఘాట్ను ఆదర్శ ఘాట్గా తీర్చిదిద్దే పనులు ప్రారంభమయ్యాయని, దీనికి దేవాన్ష్ ఘాట్ అని నామకరణం చేస్తున్నట్లు స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇటీవల వెల్లడించారు. అయితే స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో, అభిమానంతో ఈ పేరును ప్రతిపాదించినప్పటికీ, ఈ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
దీంతో ఈ విషయం కాస్తా మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఘాట్లకు లేదా ప్రజా ఆస్తులకు తన కుమారుడు దేవాన్ష్ పేరు పెట్టడం హాస్యాస్పదమని, అలాంటి పనులను తాను అస్సలు ప్రోత్సహించనని స్పష్టం చేశారు. దేవాన్ష్ పేరు మీద ఎలాంటి ఘాట్లకు నామకరణం చేయకూడదని ఇప్పటికే అధికారులకు, స్థానిక నాయకులకు కరాఖండిగా ఆదేశాలు జారీ చేశానని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజా ఆస్తుల విషయంలో ఇలాంటి కొత్త సంస్కృతికి తావులేదని నారా లోకేష్ ఈ వివాదానికి ముగింపు పలికారు.
This is ridiculous. I’ve issued directions that no ghats should be named after Devaansh. Thank you for your kind attention to this matter! 🙏 https://t.co/dhVxsEmoWB
— Lokesh Nara (@naralokesh) June 6, 2026