హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): తెలుగు తెరపై మరో తార నేలరాలింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనమడు, నందమూరి మోహనకృష్ణ పెద్ద కుమారుడు నందమూరి తారకరత్న (40) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత నెల 27న ఏపీలోని కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో స్థానికంగా చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి గుండె, మెదడుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నారు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు కన్నుమూశారు.
1983 ఫిబ్రవరి 22న జన్మించిన తారకరత్నకు భార్య అలేఖ్యరెడ్డి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 20 ఏండ్ల ప్రాయంలోనే తెరంగేట్రం చేసిన ఆయన 2001లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో హీరోగా కేరీర్ ప్రారంభించారు. ఇప్పటివరకు 23 సినిమాలు, పలు వెబ్సిరీస్లలో నటించిన ఆయన పలు చిత్రాల్లో ప్రతి కథనాయుకుడి పాత్రల్లోనూ మెప్పించారు. 2006 నుంచి మూడేండ్ల పాటు సినిమాలకు విరామం ఇచ్చిన ఆయన..ఒకేరోజు 9 చిత్రాలకు ముహూర్తం చేసి రికార్డు సృష్టించారు.
బెంగళూరుకు కుటుంబ సభ్యులు
తారకరత్న ఆరోగ్యం విషమించిందని తెలియడంతో శనివారం కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగళూరుకు తరలివెళ్లారు. అక్కడే ఉండి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశించి వైద్యులతో సంప్రదింపులు జరిపారు. ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి హైదరాబాద్ మోకిళ్లలోని స్వగృహానికి తారకరత్న భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. సోమవారం ఉదయం నుంచి సాయం త్రం 4 గంటల వరకు ఫిల్మ్చాంబర్లో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తి
తారకరత్నకు కాలేజీ రోజుల నుంచే నటన మీద ఆసక్తి ఉండేది. అగ్రనటుడు ఎన్టీఆర్ మనవడిగా కుటుంబంలోని సినీ వాతావరణం తారకరత్నను చిత్రపరిశ్రమ వైపు ఆకర్షించింది. కాలేజీ చదువు పూర్తయ్యాక 20 ఏండ్ల వయసులో 2001లో ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశారు. అయితే ఆయన చాలా సినిమాలు ప్రారంభోత్సవంతోనే ఆగిపోయాయి. యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, నందీశ్వరుడు, మనమంతా, రాజా చెయ్యి వేస్తే..ఇలా 22 చిత్రాల్లో ఆయన నటించారు. ఇటీవల ఎస్ 5 నో ఎగ్జిట్ అనే చిత్రంతోపాటు 9 అవర్స్ అనే వెబ్సిరీస్లో నటించారు. 2009లో వచ్చిన అమరావతి చిత్రంలో విలన్పాత్రకు నంది అవార్డు అందుకొన్నారు.
హీరో నుంచి విలన్గా..
హీరోగా కెరీర్ ప్రారంభించిన తారకరత్నకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమాలు ఆదరణ పొందకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్పాత్రల వైపు మళ్లారు. అమరావతి చిత్రంలో విలన్పాత్రకు ప్రేక్షకుల ప్రశంసలతోపాటు పురస్కారాలు దక్కాయి. తారకరత్న నటించిన 9 అవర్స్ వెబ్సిరీస్ మంచి ఆదరణ పొందింది. రాజకీయాల పట్ల ఆసక్తి చూపించిన తారకరత్న వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్పుకున్నారు.
సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
తారకరత్న మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. చిరంజీవి, పవన్కల్యాణ్, రవితేజ, నాగశౌర్య, అల్లరి నరేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు తమ సంతాపం ప్రకటించారు.