Nandamuri Tarakarathna | తెలుగు తెరపై మరో తార నేలరాలింది. నందమూరి తారకరత్న కన్నుమూశారు. గత నెల ఈ నెల 27న ఏపీలోని కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్న.. 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ నుంచి తారకరత్న పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం హైదరాబాద్కు తీసుకొచ్చారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రేపు మధ్యాహ్నం 3 గంటలకు తారకరత్న (Taraka Ratna) అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai reddy) తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న అకాల మరణం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. తారకరత్న సినీ రంగంలో ప్రతీ ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారని గుర్తు చేసుకున్నారు. తారకరత్న లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక అలేఖ్యరెడ్డి మానసిక ఒత్తిడికి గురైంది. తారకరత్న మరణాన్ని అలేఖ్య జీర్ణించుకోలేకపోతుందన్నారు.
నందమూరి తారకరత్న అకాల మరణాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. భర్త దూరమయ్యాడన్న బాధలో ఉన్న తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా సరైన ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య రెడ్డి నీరసంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.
టీడీపీ నేత, నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్థ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమైన విషయమన్నారు. చంద్రబాబు తమ కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంభించారని ఆమె ఆరోపించారు. నారా లోకేష్ పాదయాత్రకు, లోకేష్కు చెడ్డపేరు వస్తుందని తారకరత్న మరణవార్తను ఇన్నాళ్లు దాచిపెట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.
రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసినప్పుడే మరణవార్త ప్రకటించి ఉండాల్సిందన్న లక్ష్మీపార్వతి.. ప్రజలు అపశకునంగా భావిస్తారని ఇన్నాళ్లు డ్రామా చేశారని ఆరోపించారు. తండ్రీకొడుకులు రాష్ర్టానికే అపశకునం అని ప్రజలకు భావిస్తున్నారని చెప్పారు. తారకరత్న భార్యాబిడ్డలను, తల్లి దండ్రులను మానసిక క్షోభకు గురిచేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేయడం మానేస్తేనే నందమూరి కుటుంబం బాగుపడుతుందని పేర్కొన్నారు.
ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న (Taraka Ratna) పార్థీవదేహానికి నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు హైదరాబాద్లోని ఆయన స్వగృహానికి తరలివస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మోకిలలోని నివాసానికి వెళ్లి.. తారకరత్న పార్థీవదేహంపై పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఆయన సతీమణితోపాటు ఇతర కుటుంబసభ్యులను చిరంజీవి ఓదార్చారు. ఎంపీ విజయసాయిరెడ్డితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
నందమూరి తారకరత్న మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ తారకరత్న పార్థీవదేహానికి సినీ నటుడు అలీ నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మేం చివరిసారిగా కలిసి నటించిన సినిమా ఎస్5 . ఈ సినిమా కోసం మేం 10 రోజులు కలిసి పనిచేశామన్నారు.
తారకరత్న అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా కూడా.. సీనియర్ ఆర్టిస్టులంటే అపారమైన గౌరవం. తారకరత్న మంచి హృదయమున్న మనిషి. తారకరత్న ఆరోగ్యంగా తిరిగి వస్తారని అనుకున్నాం. కానీ అందరినీ శోకసంద్రంలో ముంచి వెళ్లిపోయారు. తారకరత్న, నా తమ్ముడు.. చిన్ననాటి స్నేహితులు. ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. తారకరత్న హీరో కాకముందు మా ఇంటికి వచ్చేవాడు. ఒకేరోజు 9 సినిమాలు లాంఛ్ చేసిన అరుదైన ఘనత తారకరత్న సొంతం.
ఏపీ రాజకీయాల్లో తారకరత్న కొద్దిరోజులుగా యాక్టివ్గా మారాడు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగానూ పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే నారా లోకేశ్ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నాడు. తాజాగా ఇదే విషయాన్ని నారా చంద్రబాబు కూడా స్పష్టం చేశారు. తారకరత్న భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందని తారకరత్న తనతో చెప్పాడని చంద్రబాబు తెలిపాడు. దీనిపై మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పానని అన్నారు. కాగా, గుడివాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా తారకరత్న పోటీ చేస్తాడని కొద్దిరోజులుగా ప్రచారం కూడా జరిగింది.
నందమూరి తారకరత్న మృతి పట్ల ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని అన్నారు.
తారకరత్న మరణం తర్వాత సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్గా మారింది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం నందమూరి తారకరత్నను చిత్ర బృందం ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా ఏండ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న తారకరత్నకు.. ఈ సినిమా ఓ మైల్స్టోన్గా నిలుస్తుందని అంతా ఆశించారు. కానీ ఈ సినిమా మొదలుకాకముందే ఈ విషాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని అభిమానులు బాధపడుతున్నారు.
తారకరత్న చాలా మంచోడు.. అందరితో సఖ్యతగా ఉంటాడని శివాజీరాజా తెలిపాడు. తనను ఒక్కడినే బాబాయ్ అని పిలిచేవాడు కాదని.. ఐదు నిమిషాల కిందట కలిసిన వ్యక్తిని కూడా వరుసలు పెట్టి పిలుస్తాడని.. అందర్నీ కలుపుకువెళ్తాడని శివాజీరాజా అన్నారు. 15 - 20 ఏళ్ల నుంచి తారకరత్నను చూస్తున్నా. ఎప్పుడూ అతన్ని సీరియస్గా చూడలేదు. ఎప్పుడూ నవ్వుకుంటూ ఉండేవాడు. మనసులో ఏదీ పెట్టుకోడని చెప్పుకొచ్చాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చాననే అహంకారం ఎక్కడా ఉండదని చెప్పాడు.
తారకరత్న అకాల మరణం చాలా దురదృష్టకరమని పోసాని కృష్ణమురళి అన్నారు. ఎన్టీఆర్ మనమడు అనే అహంకారం తనలో ఎక్కడా కనిపించదని చెప్పాడు. భద్రాద్రి రాముడు సినిమా తర్వాత తనతో ఒక సినిమా చేద్దామని అనుకున్నా. అప్పుడు తానే మా ఇంటికి వచ్చేవాడు. చాలా కూల్గా ఉండేవాడు. తారకరత్న మంచి మానవతావాది.. సినిమా హిట్టయినా.. ఫ్లాప్ అయినా ఒకేలా ఉండేవాడు అంటూ తారకరత్నతోఉన్న అనుబంధాన్ని పోసాని గుర్తు చేసుకున్నారు.
తారకరత్న పార్థివ దేహాన్ని చూసి అతని కూతురు నిష్క వెక్కి వెక్కి రోదిస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. తనతో ఎంతో ప్రేమగా ఉండే తండ్రి నిర్జీవంగా పడి ఉండటం చూసి ఆ చిన్నారి గుండె తల్లడిల్లిపోతోంది. తారకరత్న భౌతిక కాయాన్ని చూస్తూ గుండెలు పగిలేలా రోదిస్తోంది. ఆ చిన్నారిని ఓదార్చలేక అక్కడ ఉన్నవారంతా కంటతడి పెట్టుకోవడం కలచివేస్తోంది.
తారకరత్న మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. నాకు అతను మంచి మిత్రుడు. ఇద్దరం కలిసి నందీశ్వరుడు సినిమా చేశాం. సినిమాల కంటే కూడా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. రెగ్యులర్గా కలవకపోయినా తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. అంటూ తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని సినీ నటుడు అజయ్ గుర్తు చేసుకున్నారు.
నందమూరి తారకరత్నది ప్రేమ వివాహం. 2012లో తారకరత్న, అలేఖ్యరెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అలేఖ్య ‘నందీశ్వరుడు’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. అంతేకాకుండా తారకరత్న.. చెన్నైలో అలేఖ్య సిస్టర్కు సీనియర్ అట. ఇలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే వీళ్ల పెళ్లికి ఇరు కుంటుబాల నుంచి అంగీకరించలేదట. అయితే అదే టైమ్లో ఎంపీ విజయసాయిరెడ్డి మద్ధతు ఉండటంతో 2012 ఆగస్టు 2న వీరి వివాహం సంఘీ టెంపుల్లో జరిగిందని అప్పట్లో ఓ ఇంటర్వూలో అలేఖ్య చెప్పింది. కాగా అలేఖ్య రెడ్డికి ఇది రెండో వివాహం. మొదటి భర్తతో విభేదాలు రావడంతో విడాకులు ఇచ్చేసింది. ఈ కారణంగానే నందమూరి ఫ్యామిలీ తారకరత్న పెళ్ళికి అడ్డంకులు తెలిపినట్లు టాక్. ఇక వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
మోకిలలోని తారకరత్న నివాసానికి ఆయన సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ చేరుకున్నారు. అక్కడ తారకరత్న పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అచేతనంగా పడివున్న సోదరుడిని చూసి ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు.
తారకరత్న భౌతిక కాయానికి ఎంపీ విజయసాయిరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యంతో తారకరత్న తిరిగిరావాలని కోరుకున్నామని.. కానీ విధి మరోలా తలచిందని అన్నారు. తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమైని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
తారకరత్న మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. తారకరత్న కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు.
Pained by the untimely demise of Shri Nandamuri Taraka Ratna Garu. He made a mark for himself in the world of films and entertainment. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 19, 2023
తారకరత్న పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫిలిం ఛాంబర్లో ఉంచనున్నారు. సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
నందమూరి తారకరత్న పార్థివ దేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. నగరంలోని మోకిలలోని తన స్వగృహానికి తారకరత్న భౌతిక కాయాన్ని తరలించారు. తారకరత్నను కడసారి చూసేందుకు నందమూరి కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు నివాసానికి చేరుకుంటున్నారు.
నందమూరి తారకరత్న మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
తారకరత్న మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. చిరంజీవి, పవన్కల్యాణ్, రవితేజ, నాగశౌర్య, అల్లరి నరేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు తమ సంతాపం ప్రకటించారు.
తారకరత్న ఆరోగ్యం విషమించిందని తెలియడంతో శనివారం కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగళూరుకు తరలివెళ్లారు. అక్కడే ఉండి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశించి వైద్యులతో సంప్రదింపులు జరిపారు. ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి హైదరాబాద్ మోకిళ్లలోని స్వగృహానికి తారకరత్న భౌతికకాయాన్ని తీసుకురానున్నారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనమడు, నందమూరి మోహనకృష్ణ పెద్ద కుమారుడు నందమూరి తారకరత్న (40) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత నెల 27న ఏపీలోని కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో స్థానికంగా చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి గుండె, మెదడుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నారు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు కన్నుమూశారు.