హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న విలేకరి కుటుంబాన్ని నమస్తే తెలంగాణ యాజమాన్యం ఆదుకొన్నది. రూ.5 లక్షలు అందజేసి వారి కన్నీటిని తుడిచింది. మెదక్ జిల్లా తూప్రాన్కు నమస్తే తెలంగాణ స్థానిక విలేకరిగా పనిచేస్తున్న నాగరాజు ఈ ఏడాది ఆగస్టు 15న ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించారు. స్థానిక విలేకరుల (న్యూస్ కంట్రిబ్యూటర్లు) పేరిట సంస్థ యాజమాన్యం గతంలోనే రూ.5 లక్షల ప్రమాద బీమా చేయించింది.
సంస్థే ప్రీమియం కట్టింది. దానికి సంబంధించిన చెక్కును సోమవారం నమస్తే తెలంగాణ ప్రధాన కార్యాలయంలో సంస్థ సీఎండీ దీవకొండ దామోదర్రావు, ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి, చీఫ్ ఆఫ్ బ్యూరో ఓరుగంటి సతీశ్, న్యూస్ నెట్వర్క్ ఇన్చార్జి ఎస్జీవీ శ్రీనివాసరావు నాగరాజు సతీమణి లతకు అందజేశారు. నాగరాజు మరణించిన రోజే తక్షణ సాయం కింద సంస్థ రూ.47 వేలు అందజేసింది. ఆపదలో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకొన్నందుకు నమస్తే తెలంగాణ యాజమాన్యానికి నాగరాజు సతీమణి లత, కుమారుడు మధు కృతజ్ఞతలు తెలిపారు.