నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ ౨౮ (నమస్తే తెలంగాణ): గంజాయి దందాను అరికట్టేందుకు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్పై ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులను రాజకీయాల్లోకి లాగడం సరికాదని, ఆయన చేసిన తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని డీఐజీ, నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. గంజాయిని అన్నిస్థాయిల్లో నిర్మూలించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన నల్లగొండలో ఒక ప్రకటన విడుదల చేశారు. గంజా యి స్పెషల్ డ్రైవ్పై వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా పోలీస్ అధికారి పేరుతో చేసిన ప్రకటనలు పరోక్షంగా తనను ఉద్దేశించినవిగానే భావిస్తున్నట్టు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి తాను దగ్గరగా ఉంటానని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. తాను చెప్పడం వల్లే కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పోలీసు అధికారులు గంజాయి కోసం ఏవోబీ ప్రాంతంలో దాడులు చేస్తున్నారనడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. ఎంపీ హోదాలో ఉన్న విజయసాయిరెడ్డి గంజాయి అంశంలో సరైన సమాచారం లేకపోవడం వల్లనో, తప్పుడు సమాచారం కారణంగానో తనపై ఆరోపణలు చేస్తున్నట్టుగా అనిపిస్తున్నదని తెలిపారు.