నీలగిరి, అక్టోబర్ 28 : కరోనా వైరస్ను అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రధాన అస్త్రంగా వైద్యా రోగ్యశాఖ యంత్రాంగం ముందుకు సాగుతున్నది. ఇందుకు నల్లగొండ జిల్లాలో నవంబర్ 3న టార్గెట్గా పెట్టుకుని వైద్యారోగ్యశాఖ మాస్ వ్యాక్సినేషన్ను వేగంగా నిర్వహిస్తున్నది. అక్టోబర్ 19న జరిగిన రాష్ట్ర సమీక్షా సమావేశంలో నల్లగొండ జిల్లా చివరి నుంచి మూడో స్థానంలో ఉండగా పది రోజుల్లోనే పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ నిర్వహించి 14వ స్థానానికి చేరుకుంది. రానున్న వారం రోజుల్లో మరింత వేగవంతం చేసి నూరుశాతం వ్యాక్సినేషన్ జిల్లాగా మార్చేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు.
పది రోజుల్లో 14వ స్థానానికి
జిల్లాలో జనవరి 16న కరోనా టీకాను ప్రభుత్వం ప్రారంభించింది. ముందుగా హెల్త్వర్కర్లు, అంగన్వాడీలు, ఫ్రంట్లైన్ వర్కర్లు, మూడు నాలుగు విభాగాలుగా గుర్తించి వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. అయితే జనవరి నుంచి సెప్టెంబర్ 15 వరకు జిల్లాలో కేవలం 2.5 లక్షల మందికి మాత్రమే టీకా వేశారు. ప్రభుత్వం సెప్టెంబర్ 16 నుంచి మాస్ వ్యాక్సినేషన్ చేపట్టింది. అయితే నెలరోజుల తరువాత రాష్ట్ర ప్రభుత్వం మాస్ వ్యాక్సినేషన్పై అక్టోబర్ 19న రాష్ట్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో జిల్లా చివరి నుంచి మూడో స్థ్ధానంలో ఉంది. దీన్ని చాలెంజ్గా తీసుకున్న యంత్రాంగం పదిరోజుల్లో సుమారు 3 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేపట్టి రాష్ట్ర స్థాయిలో 30 నుంచి 14వ స్థ్దానానికి చేరుకుంది.
వివరాల సేకరణ
జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు 12,07,165 మంది అర్హులుగా జిల్లా యంత్రాంగం గుర్తించింది. అందులో 8,64,126 మందికి ఇప్పటికే వ్యాక్సినేషన్ చేశారు. మిగిలిన 3,43,039 మందికి వ్యాక్సినేషన్ చేయాలనే లక్ష్యంగా ఉన్నారు. అయితే వీరంతా హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు సరిహద్దుగా ఉన్న జిల్లాలోని చిట్యాల, దేవరకొండ, చింతపల్లి, మునుగోడు, కేతేపల్లి మండలాల వారు ఇతర జిల్లాల్లో వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. వారం రోజుల క్రితం జిల్లాలో అంగన్వాడీలు, ఆశ వర్కర్లు తమ పరిధిలో సర్వే చేస్తూ ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. అంతేకాకుండా వ్యాక్సినేషన్ అయినట్లు స్టిక్కరింగ్ కూడా చేశారు. కానీ వ్యాక్సినేషన్ నమోదులో మాత్రం చాలా వెనుకబడి ఉన్నట్లు ఆన్లైన్లో వివరాలు కనిపిస్తున్నాయి. దీంతో జిల్లాతోపాటు ఇతర రాష్ర్టాల్లో వ్యాక్సినేషన్ చేయించుకున్న వారు సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉన్నట్లుగా ప్రాథమిక అంచనా. వీరందని కూడా మరోమారు వ్యాక్సినేషన్ చేయించుకుంటే వారి ఫోన్ నంబర్లు, ఆధార్కార్డులు ఇతర వివరాలు సేకరించి ఎక్కడ వ్యాక్సిన్ వేయించుకున్నారో ఆన్లైన్ నమోదు చేయనున్నారు.
మిగిలింది పది శాతం మాత్రమే
జిల్లాలో 71 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. మిగిలిన 29 శాతంలో సుమారు 15 శాతం మంది ఇతర రాష్ర్టాలు, జిల్లాలకు పలు ప్రాంతాలకు వలస పోయారు. వారందరూ కూడా జిల్లాలో అర్హులు ఉండి ఇతర ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయించుకోవడంతో అక్కడ నమోదై ఇక్కడ నమోదు కాకపోవడంతో వెనుకబడి ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. దాంతో ఇంకా జిల్లాలో వ్యాక్సినేషన్ చేయించుకోని వారు కేవలం 14శాతం మంది మాత్రమే ఉన్నారు. అందులో కూడా మరో నాలుగు శాతం మంది కరోనా వచ్చి బాధపడుతున్న వారు, కరోనా వచ్చి తగ్గి వ్యాక్సిన్ వేసుకునేందుకు అర్హత లేని వారు ఉన్నట్లుగా గుర్తించారు. మిగిలిన 10 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో వారికి అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేయించేలా వైద్యారోగ్యశాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ, సమభావన సంఘాలు కార్యక్రమాలు చేపట్టాయి.
ఉమ్మడి జిల్లాలో వ్యాక్సినేషన్ 82.39 శాతం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 24,98,366 మం దికి టీకా వేయాలని లక్ష్యంగా తీసుకోగా అందులో 20,58,626 మందికి మొదటి డోసు వేసి 82.39 శాతాన్ని పూర్తి చేసింది. వీటిలో 6,54,393 మందికి రెండో డోసు వేసింది. ఉమ్మడి జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంది. ఆయా జిల్లాలో 4,80,449 మందికి వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించగా అందులో 4,37,450 మందికి మొదటి డోస్ టీకా వేసే 91.7 శాతంతో ఉమ్మడి జిల్లాలో అగ్రభాగంలో ఉంది. 2, 12,625 మందికి రెండోడోసు వ్యాక్సిన్ వేశారు. సూర్యాపేట జిల్లాలో 8,10,752 మందికి వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించగా అందులో 5,75,050 మందికి మొదటి డోసు, 1,96,735 మందికి రెండో డోసు వ్యాక్సినేషన్ చేసి 70 శాతం చేశారు. రాష్ట్రంలోనే విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లాగా ఉన్న నల్లగొండ గిరిజన తండాలు అధికంగా ఉండడంతోపాటు మారుమూల ప్రాంతాలు కూడా అత్యధికంగా ఉన్నాయి. జనాభా పరంగా కూడా మిగతా రెండు జిల్లాల కంటే రెండింతలు అధికంగా ఉంది. దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా సాగుతున్న కూడా సంఖ్యపరంగా తక్కువగానే ఉంది. నల్లగొండ జిల్లాలో 12,20402 మందికి వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించగా అందులో 8,64,126 మందికి మొదటి డోసు, 2,45,033 మందికి రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేశారు.
3 నాటికి నూరు శాతం వ్యాక్సినేషన్
నల్లగొండ జిల్లాలో వచ్చే నెల 3 నాటికి నూరు శాతం వ్యాక్సినేషన్ చేసేలా ప్రత్యేక కార్యచరణతో అమలు చేస్తున్నాం. మూడ్రోరోజులుగా రాష్ట్రంలోనే అత్యధిక టీకాలు వేసిన జిల్లాగా నల్లగొండ ముందు స్థానంలో ఉంది. నల్లగొండ జిల్లావాసులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి అక్కడ వ్యాక్సిన్ వేయిం చు కోవడం వల్ల జిల్లా టీకాల నమోదులో సంఖ్యపరంగా తక్కువగా వస్తుంది. ఇప్పుడు జిల్లాలో అర్హులుగా గుర్తించిన వారు ఇతర ప్రాంతాల్లో టీకాలు వేసుకుంటే వారి వివరాలను కూడా నమోదు చేస్తాం.