మిర్యాలగూడ, అక్టోబర్ 24 : పెట్రో మంట ఆరడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో సామాన్యులపై పెను భారం పడుతున్నది. పెట్రో ధరల భారం నిత్యవసరాలతో పాటు అన్ని వస్తువులపై పడుతుండడంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వంట గ్యాస్ ధర కూడా ఏడాదిలో రూ. రూ. 300కు పైగా పెరిగింది. గతేడాది రూ.650 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 973కు చేరింది.
పది రోజుల్లో ఆరుసార్లు పెరిగిన ధరలు
ఇంధన ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండడంతో సామాన్యులు చతికిల పడుతున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నియంత్రణ లేని పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలతో అన్ని వస్తువుల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. పది రోజుల వ్యవధిలో పెట్రోల్ 6 సార్లు, డీజిల్ 8 సార్లు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ధరల పెరుగుదలను నియంత్రించక పోవడంతో ఈ భారం పరోక్షంగా నిత్యావసర వస్తువులపై సైతం పడుతున్నది.
వంట గదిలో ధరల మంట
వంట గ్యాస్ ప్రస్తుతం నిత్యవసర వస్తువుగా మారింది. ఇది లేక పోతే ఆరోజు భోజనం దొరకని పరిస్థితి నెలకొంది. అయితే పెరిగిన ధరలతో వంట గ్యాస్ వినియోగంపై సామాన్యులు ఆలోచించాల్సిన దుస్థితి నెలకొంది. పేద, మధ్య తరగతి ప్రజలు చాలా మంది ఇప్పటికే ప్రత్యామ్నాయంగా కట్టెలు వాడుతున్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెంచడం వల్ల ప్రతినెలా ప్రజలపై భారం పడుతున్నది. 2020 నవంబర్లో రూ.670 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర డిసెంబర్లో రూ.770కి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఏడాది కాలంగా వంట గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతోంది. 2021 ఫిబ్రవరిలో రూ.75, మార్చిలో రూ.50 పెంచగా.. ఏప్రిల్లో కంటి తుడుపుగా రూ.10 తగ్గించారు. తిరిగి జూలైలో రూ.25.50, ఆగష్టులో రూ.25, సెప్టెంబర్లో రూ.25, అక్టోబర్లో మరోసారి పెంచడంతో ప్రస్తుతం రూ.973కు చేరింది. దీంతో పేద ప్రజలు కట్టెల పొయ్యి వైపు చూసే పరిస్థితి నెలకొంది.
సెంచరీ దాటిన డీజిల్
పెట్రోల్ డీజిల్ ధరలను గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయికి తీసుకెళ్లింది. ధరల పెరుగుదల వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 2021 సెప్టెంబర్ 28 వరకు 99.67 ఉన్న డీజిల్ అక్టోబర్ 1 నాటికి రూ.100.32కు చేరింది. ప్రస్తుతం లీటరు డీజిల్ ధర రూ. 104.80గా ఉంది. పది రోజుల్లోనే ఎనిమిది సార్లు పెరిగింది. ఈ ప్రభావం రవాణా రంగంపై తీవ్రంగా పడుతుండగా నిత్యావసర వస్తువులపై ధరలు కూడా పెరుగుతున్నాయి.
వంట గ్యాస్ భారంగా మారింది
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచటం వల్ల మాలాంటి వారిపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నది. గ్యాస్ సిలిండర్ ధర ఇలాగే పెరుగుతుంటే కట్టెల పొయ్యే దిక్కయ్యేలా ఉంది. ధరలు తగ్గించి సామాన్యులను ఆదుకోవాలి.
బండి బయటికి తీయాలంటే భయంగా ఉంది
పెరిగిన పెట్రో ధరల వల్ల బండి బయటికి తీయాలంటే భయపడాల్సి వస్తున్నది. డీజిల్ ధరలు పెరగడం వల్ల సరుకు రవాణా వాహనాల చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రతినెలా ఖర్చులు పెరుగుతున్నాయి. సామాన్యులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి.