మిర్యాలగూడ రూరల్, నవంబర్ 11 : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆరుతడి పంటలు సాగు చేసేందుకు సాగర్ ఆయకట్టు రైతులు అడుగులు వేస్తున్నారు. యాసంగి ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు తప్పవనే ఆలోచనతో ప్రయత్యామ్నాయం దిశగా ఆలోచిస్తున్నారు. మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
అనుకూలమైన ప్రాంతాలు..
మిర్యాలగూడ నియోజకవర్గంలో మాడ్గులపల్లి, అడవిదేవులపల్లి, వేములపల్లి మండలాలతో పాటు, మిర్యాలగూడ, దామరచర్ల మండలాల్లో సాగర్ ఎడమ కాల్వ చివరి భూములు ఆరు తడి పంటల సాగుకు అనుకూలం. దాంతో వేరుశనగ, పచ్చ జొన్న, పొద్దు తిరుగుడు, మినుములు, ఉలువ, కంది పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా వేరుశనగ సాగులో కొద్దిపాటి శ్రమకోర్చితే లాభాలు బాగుంటాయని, మార్కెట్లోనూ ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని అంటున్నారు.
వేరుశనగ, మినుముల సాగు వైపు మొగ్గు
మాడ్గులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ మండలంలో ఊట్లపల్లి, తక్కెళ్లపహాడ్, కొత్తగూడెం, బి.అన్నారం, జడ్వీగూడెం, కొత్తగూడెం, కొత్తపేట వేరుశనగ, గోగువారిగూడెం గ్రామాల్లో ఆరు తడి పంటలు సాగు చేస్తున్నారు. మినుమలు, నువ్వులు, పచ్చజొన్న కూడా సాగవుతున్నాయి. దామరచర్ల మండలంలో తాళ్ల వీరప్పగూడెం, నర్సాపురం, కల్లేపల్లి, శాంతినగర్, గాంధీ నగర్, కేశవాపురం గ్రామాల్లో వరికి ప్రత్యామ్నాయంగా వేరు శనగ, మినుము సాగు కోసం దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు.
పంట మార్పిడిని ప్రోత్సహించాలి
ఒకే పంట వేస్తుంటే భూసారం తగ్గిపోయి దిగుబడి రాక నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఆరు తడి పంటల సాగును పోత్సహించాలి. విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించాలి. ఆ విధంగా ప్రోత్సహిస్తే ఆరు తడి సాగుకు రైతులు ముందుకు వస్తారు.
మారక పోతే మనుగడ లేదు..
రైతులు సాగులో మూస విధానాన్ని వీడాలి. వరి ధాన్యానికి డిమాండ్ తగ్గుతున్నది. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ప్రైవేటులో వ్యాపారులు అడిగిన ధరకు అమ్ముకోవాల్సి ఉంటుంది. పెట్టుబడి ఖర్చులూ రాక తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది. అందుకే ఆరుతడికి అనుకూలమైన నేలల్లో తప్పని సరిగా వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.
వేరుశనగ వేద్దామనుకుంటున్నా..
యాసంగిలో నేను వరి కాకుండా వేరుశనగ వేద్దామనుకుంటున్నా. ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు కూడా పంట మార్పిడి మంచిదని చెప్తున్నరు. నాకు కూడా వరి కంటే వేరుశనగే మంచిదనిపిస్తున్నది. ఇప్పటికే మా గ్రామంలో 30 మంది రైతులు వేరుశనగ విత్తనాలు తెచ్చుకున్నరు. వేరుశనగ సాగు వల్ల కూలీలకూ చేతి నిండా పని దొరుకుతుంది.
యాసంగిలో కంది వేస్తున్నా..
నాకు నాలుగు ఎకరాలు ఉంది. ఇంకో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వానకాలంలో వరి సాగు చేశాను. చీడపీడల కారణంగా అనుకున్న దిగుబడి రాలేదు. పంటకు పెట్టిన కనీస పెట్టుబడి కూడా రాలేదు. యాసంగిలో కంది వేద్దామని నిర్ణయించుకున్నా. మొత్తం ఏడెకరాల్లో నాలుగు ఎకరాల్లో కంది పంట వేస్తున్నాను. ఇప్పటికే వ్యవసాయ అధికారులు
సలహాలు తీసుకున్నా.
లాభసాటి పంటలే మేలు..
వానకాలం వరి వేశాను. యాసంగిలో వేరుశనగ సాగు చేస్తాను. మూడు ఎకరాలకు 3 క్వింటాళ్ల విత్తనాన్ని తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నా. వారం రోజుల్లో విత్తనాలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నా. గతేడాది వేరుశనగ సాగుతోనే లాభాలు వచ్చాయి.