దామరచర్ల, డిసెంబర్ 8 : మండలంలోని మారుమూల ప్రాంతమైన పడమటి తండా దర్గాల సమాహారంగా నిలుస్తున్నది. దేశవ్యాప్తంగా సుమారు 80దర్గాలకు సంబంధించిన మోడల్ సమాధులను నిర్మించడం ఈ ప్రదేశం ప్రత్యేకత. ప్రతి శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులతో ఈ ప్రాంతం సందడిగా ఉంటుంది. రావుల లక్ష్మయ్య అనే వ్యక్తి షేక్ జానీమియాగా తన పేరును మార్చుకుని దర్గా, సమాధులను నిర్మించడం విశేషం. మొత్తం 5 ఎకరాల్లో సమాధులు నిర్మించగా, మరో రెండు ఎకరాల్లో కంది సాగు చేస్తున్నాడు. కుటుంబంతో సహా దర్గా వద్ద నివాసం ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.
మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన రావుల లక్ష్మయ్య జాన్పహాడ్ సైదులు బాబా భక్తుడు. జాన్పహాడ్ దర్గాలో 15 సంవత్సరాలు సేవ చేశాడు. సైదులు బాబా కలలో దర్శనమిచ్చి ఆజ్ఞాపించడంతో తాను మహ్మదీయుడిగా మారి జానీమియాగా పేరు మార్చుకున్నానని తెలిపాడు. పేరుతో పాటుగా వేశభాషలను మార్చుకుని స్వగ్రామంలో 25ఏండ్ల కిందట దర్గాను నిర్మించాడు. నిత్యం ప్రార్థనలు చేస్తూ దేశంలోని పలు ప్రార్థనా స్థలాలను దర్శించాడు. జమ్ముకశ్మీర్, రాజస్థాన్, నాగపూర్ తదితర రాష్ట్రాలతో పాటుగా కర్నూలు, పెనుగొండ, అర్వపల్లి దర్గాలను దర్శించి వాటికి ప్రతీకగా సుమారు 80 నిర్మాణాలు చేపట్టాడు. ప్రధాన దర్గాలో సమాధులను ఏర్పాటు చేశాడు. దర్గా వద్ద పుట్టకు భక్తులు పూజలు చేస్తుంటారు. చుట్టూ చెట్ల మధ్య నిర్మించిన దర్గా, సమాధులు ప్రత్యేక వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఏటా ఉర్సు నిర్వహించి గంధోత్సవం జరిపిస్తారు.