వ్యవసాయ ఆధారిత మన రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ గతంలో వ్యవసాయ బావులు ఉండేవి. మోటబావులను ఆనుకొని బావిగడ్డలు వెలిసేవి. బావి తవ్వగా వచ్చిన మట్టిని కుప్పపోస్తే ఆ స్థలంలో పొదలు, చెట్లు పెరిగేవి. తుమ్మ, వేప, రావి, మర్రి, చింత, మామిడి, మేడి, సీతాఫలం, జామ, రేగు చెట్లు గుబురుగా పెరిగేవి. గడ్డపై పశువుల దొడ్లు నిర్మించేవారు. గడ్డివాములు వేసేవారు. బావిగడ్డను ఆనుకొని మోటబావుల కోసం రాళ్ల తెట్టె ఉంటుంది. రాళ్ల సందుల్లో కప్పలు, పాములు, గండుపిల్లులు, ముంగీసలు బతికేవి. సాగునీటి వనరులు పెరుగడంతో పాటు రియల్ ఎస్టేట్ వెంచర్ల నిర్మాణంతో జీవ వైవిధ్యానికి ప్రతిబింబమైన బావి గడ్డలు నేడు కనుమరుగవుతున్నాయి. వ్యవసాయ బావిగడ్డ.. పొదలు, ఈత, తాటి చెట్లతో పాటు భారీ వృక్షాలు, తీగజాతి మొక్కలు పెరిగేవి. చెట్లపై కాకులు, రామచిలుకలు, కొంగలు, పిచ్చుకలు, ఉడుతలు, తేనె టీగలు నివాసం ఏర్పరుచుకొనేవి. ఆ వృక్షాల చిగుళ్లు, పండ్లు, కాయలు, ఆకులను ఆహారంగా తీసుకొని తిరిగి తమ పెంట ద్వారా బీజ వ్యాప్తికి ఉపయోగపడేవి. వృక్షాల నుంచి రాలిపడిన ఆకుల ద్వారా నేల సారవంతమయ్యేది. నేడు బావిగడ్డలపై చెట్లను తొలగిస్తుండడంతో ఆశ్రయం కరువై పక్షులు అంతరించిపోయాయి. వృక్షాలు నరకడంతో జీవవైవిధ్యానికి ముప్పు ఏర్పడింది.
రైతుకు ఆదాయ వనరు
బావి గడ్డలు రైతులకు ఆదాయమార్గంగానూ ఉండేవి. తేనె, జామ, మేడి, సీమచింత, చింత, మామిడి కాయలు లభించేవి. పండ్లు విక్రయించి ఆదాయం పొందేవారు. అలాగే వ్యవసాయ పనుల్లో ఉపయోగించే నాగలి, ఎడ్లబండి, గృహ నిర్మాణానికి అవసరమైన కలప లభించేది. పంట నూర్పిళ్ల సమయంలో, వరిధాన్యం ఆరబోయడానికి ఉపయోగపడేవి. వ్యవసాయ పనులకు వచ్చిన కూలీలు బావిగడ్డపైనే భోజనాలు చేసి సేదదీరేవారు. వేసవి సెలవుల్లో చిన్నారులంతా బావుల్లోనే ఈతనేర్చుకునేవారు.
బాయి కాడ భలే సందడి ఉండేది
వ్యవసాయ బావిగడ్డలు, ఆ బావి మొత్తం వ్యవసాయానికి కేంద్ర బిందువుగా ఉండేది. బావి వద్దకు వచ్చిన వారికి ఏడాది పొడవునా పండ్లు లభించేవి. వ్యవసాయ పనుల్లో అలసిన రైతులు, కూలీలు బావిగడ్డ చెట్ల కింద కునుకు తీసేవారు. పక్షుల అరుపులతో సాయంకాలం సందడిగా ఉండేది. వసంతంలో కోకిల అరుపులను పిల్లలు అనుకరించేవారు.
పొలంలో పది శాతం అడవి ఉండాలె..
రైతుకు ఉన్న మొత్తం పొలంలో 10శాతం అడవిని పెంచాలన్న ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్తల సందేశాలను ప్రచారం చేయాలి. బావిగడ్డల మీద చెట్ల సంరక్షణకు రైతులను ప్రోత్సహించాలి. హరిత తెలంగాణ సాధనకు తమవంతు బాధ్యతగా బావిగడ్డల మీద ఉన్న చెట్లను సంరక్షించడం కోసం రైతులు శ్రద్ధ వహించాలి. పక్షుల ఆవాసాలకు రక్షణ కల్పించాలి.
పెరిగిన భూముల ధరలతో..
జనాభా పెరుగడంతో గ్రామాల్లో కొత్తగా కాలనీలు ఏర్పాటవుతున్నాయి. బావుల స్థానంలో బోర్లు రావడం, కాల్వల ద్వారా సాగునీరు అందుతుండడంతో వాటి వినియోగం తగ్గిపోయింది. రియల్ భూమ్ కారణంగా నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చివేస్తున్నారు. బావిగడ్డల మట్టిని ఇండ్ల నిర్మాణానికి తరలిస్తున్నారు. బావిగడ్డలను ప్లాట్లుగా మార్చి అమ్మేస్తున్నారు.