Raj Nidimoru | సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకురాలు నందినీ రెడ్డి, నటి-నిర్మాత సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు మరియు చిత్రబృందం హాజరై సందడి చేశారు. ఈవెంట్ మొత్తం సమంత అభిమానుల సందడితో మార్మోగిపోయింది. ముఖ్యంగా రాజ్ నిడిమోరు స్టేజ్పై మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గట్టిగా నినాదాలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఫ్యాన్స్ ఏమంటున్నారో తనకు సరిగా వినిపించడం లేదని రాజ్ చెప్పగా, యాంకర్ సుమ వెంటనే స్పందించారు. “అభిమానులు సమంతకు ఒకసారి ‘ఐ లవ్ యూ’ చెప్పమని అడుగుతున్నారు” అని చెప్పడంతో సభలో చప్పట్లు, కేకలు మార్మోగాయి.
అయితే ఆ ప్రశ్నకు రాజ్ నిడిమోరు ఎంతో చాకచక్యంగా స్పందించారు. ఇప్పటికే స్టేజ్పై చాలామంది ఆమెకు ఆ మాట చెప్పారు. కింద ఉన్న ప్రేక్షకులు కూడా అదే చెబుతున్నారు. అందులో కొత్తగా నేను చెప్పాల్సిందేమీ లేదు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. దీంతో ఆయన కామెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక వ్యక్తిగత విషయాలను పక్కనబెట్టి సమంత నటనపై రాజ్ ప్రశంసల వర్షం కురిపించారు. షూటింగ్ సమయంలో సమంతలోని అద్భుతమైన నటన తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. తాము ఒక విధంగా ఊహించిన సన్నివేశాలను సమంత ఒక్క టేక్లోనే మరింత ప్రభావవంతంగా చేసి చూపించేదని చెప్పారు.
ప్రస్తుతం నేను సమంతతో ఒక నటిగానే మాట్లాడుతున్నాను. ప్రతి సన్నివేశంలో కొత్తదనాన్ని చూపించే అద్భుతమైన నటి ఆమె. అలాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్తో కలిసి పనిచేయడం ఎంతో ఎక్సైటింగ్గా ఉంటుంది అని రాజ్ కొనియాడారు. అలాగే హిందీలో ఎన్నో ప్రాజెక్టులు చేసినప్పటికీ, తెలుగు ప్రేక్షకుల నుంచి ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి వస్తున్న స్పందన తనకు ప్రత్యేక ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా రాజ్ తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించగా, మధ్యలో ఇంగ్లిష్లోకి వెళ్లడంతో సమంత సరదాగా “తెలుగులోనే మాట్లాడొచ్చు కదా” అని చెప్పడం కూడా సభలో నవ్వులు పూయించింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ తర్వాత మరోసారి సమంత-రాజ్ కాంబినేషన్ వార్తల్లో నిలవగా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన ఈ సంఘటన అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.