హుజూర్నగర్టౌన్, డిసెంబర్ 3 : హుజూర్నగర్ మండలంలో కొవిడ్ వ్యాక్సినేషన్ తుది దశకు చేరింది. ఇప్పటి వరకు 95 శాతం మందికి తొలిడోస్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా హుజూర్నగర్ పట్టణంతోపాటు 11 గ్రామాల్లో 14 ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి 14 మంది ఏఎన్ఎంలు, 48 మంది ఆశ వర్కర్లు టీకా వేసుకోని వారిని గుర్తించి వేస్తున్నారు. వారికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది సాయం అందిస్తున్నారు. రోజుకు 300 మందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో టీకా ఆవశ్యకత, మాస్కు ప్రాధాన్యంపై గ్రామస్తులకు ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెలాఖరులోగా అర్హులందరికీ తొలి టీకా అందించేలా సిబ్బంది కృషి చేస్తున్నారు.
రెండు డోసులు తీసుకుంటే ముప్పు ఉండదు..
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొవిడ్ వైరస్ సోకినా ప్రమాదం ఉండదు. మొదటి డోసు వేసుకున్నా రెండో డోసు వేసుకోవడంలో కొందరు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఊహాగానాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. ప్రజలంతా మాస్కు ధరించాలని ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నారు. ప్రస్తుతం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి డోసు పూర్తయి రెండో డోసు వేయించుకోని వారు వేయించుకోవాలి.