భూమి పరిమిత వనరు. కానీ, నానాటికీ పెరుగుతున్న జనాభా అపరిమితం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను అందించడం కష్ట సాధ్యం. ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం 2050 సంవత్సరం నాటికి 900 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభాకు అనువుగా ఇప్పటి ఆహార ధాన్యాల ఉత్పత్తిని 60 శాతానికి పైగా పెంచాల్సి ఉంటుంది. 1960లో మొదలైన హరిత విప్లవం వల్ల విత్తన నాణ్యత పెరిగి దిగుబడి గణనీయంగా వచ్చింది. కానీ, సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో రసాయన ఎరువుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. దాంతో భూసారం తగ్గిపోయి లక్షలాది హెక్టార్ల విస్తీర్ణంలో పంట భూములు బీళ్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మనిషి మనుగడకు అవసరమైన భూ ఆరోగ్యాన్ని కర్తవ్యంగా స్వీకరించాలనేది నిపుణుల మాట. నేలల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 5ను ప్రపంచ మృత్తికా దినోత్సవంగా ప్రకటించింది. పపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా నేలల పరిరక్షణకు అనుసరించాల్సిన విధానాలపై ప్రత్యేక కథనం.
గరిడేపల్లి, డిసెంబర్ 4
అశాస్త్రీయ పద్ధతుల్లో సాగుతో భూమి నిస్సారం
అనంతమైన జీవ వైవిధ్యానికి ఆరోగ్యకరమైన నేలలే పట్టుగొమ్మలు. ఒక ప్రాంతంలో ఉండే జీవసమూహంలోని వ్యత్యాసాలను జీవ వైవిధ్యంగా పరిగణిస్తారు. నేలలో కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఒక అంచనా ప్రకారం చదరపు మీటర్ వైశాల్యంలోని మంచి నేలలో వెయ్యి రకాల సూక్ష్మజీవుల జాతులు ఉండి జీవ వైవిధ్యానికి కారణమవుతున్నాయి. కర్బన సమ్మేళనాలను వినియోగించుకుని పర్యావరణాన్ని కాపాడుతున్నాయి.
నేలల సంరక్షణకు మార్గాలెన్నో…
నేలల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు మంచి సాగు పద్ధతులున్నాయి.సేంద్రియ ఎరువులు, జీవసంబంధ పురుగు మందులు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు ఉపయోగించాలి. నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ కొండ ప్రాంతాల్లోని పోడు వ్యవసాయ పద్దతి నియంత్రించాలి. సమగ్ర పద్ధతులను పాటించి నేలకోతను అరికట్టాలి. నీటి వినియోగాన్ని సమర్థవంతంగా చేపట్టాలి.భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులను వాడాలి. అదే రీతిలో సమగ్ర చీడ, పీడల యాజమాన్యం చేపట్టాలి. విత్తనానికి అవసరమైన చోట మాత్రమే దుక్కి చేయాలి. నేలను కప్పి ఉంచే పద్ధతిని అనుసరించాలి.పంటమార్పిడి, అంతరపంటలు, మిశ్రమ పంటలు, సాగు విధానాల కొనసాగింపుతో నేలకోతను అరికట్టవచ్చు. అలాగే తగినన్ని ఆహార ఉత్పత్తులు సాధించవచ్చు.వ్యవసాయ పంటలను, అటవీమొక్కలను సంయుక్తంగా ఒకే పొలంలో సాగు చేయడాన్ని వ్యవసాయ, అటవీ సంయుక్త పద్ధతిగా చెప్పుకోవచ్చు. దాంతో నివాసాలకు అవసరమైన కలప, పశుగ్రాసం వంటి ఉత్పత్తులు సుస్థిరమైన రీతిలో సమకూరుతాయి.
నేలల పరిరక్షణ అందరి బాధ్యత
అధిక దిగుబడులు సాధించాలనే ఏకైక లక్ష్యంతో రైతులు మోతాదుకు మించి రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. మరోవైపు పారిశ్రామిక వ్యర్థాల కారణంగా నేల సారం తగ్గిపోతున్నది. చీడ, పీడల ఉధృతి పెరుగుతున్నది. ఏ పంట పండాలన్నా నేల ముఖ్యమైనది కనుక ప్రతి ఒక్కరూ నేల పరిరక్షణను బాధ్యతగా తీసుకోవాలి.
మిత్ర పురుగులతో మంచి దిగుబడులు
అన్ని పురుగులు పంటకు శత్రువులు కాదని గుర్తించాలి. తెగులు, చీడల గురించి అవగాహన పెంచుకోవాలి. మేలు చేసే పురుగులకు వేప నూనె పిచికారీ చేస్తే ఎలాంటి హాని ఉండదు. మిత్ర పురుగులను కాపాడుకోవాలని వ్యవసాయధికారులు సూచిస్తున్నారు.
మిత్ర పురుగులను రక్షించుకోవాలి
అన్ని పురుగులు పంటలకు హానికరం కావు. కొన్ని పురుగులు మాత్రమే నష్టం కలిగిస్తాయి. మేలు చేస్తే మిత్ర పురుగులను రైతులు రక్షించుకోవాలి. కానీ, అధిక దిగుబడులు సాధించాలనే ఆలోచనలో రసాయన మందులను మోతాదుకు మించి పిచికారీ చేయడంతో ప్రమాదం ఏర్పడుతున్నది. మేలు చేసే పురుగులు అంతరించి కాలుష్యం ఏర్పడుతున్నది. వేపనూనెను పిచికారీ చేస్తే పంటకు లాభం చేసే పురుగులు చనిపోవు.