న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ పదాధికారుల భేటీ సోమవారం ఢిల్లీలో జరుగనున్నది. ఈ సందర్భంగా రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రైతుల ఆందోళన, కొవిడ్ మహమ్మారితో పాటు పలు సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు. భేటీకి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షత వహించనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత వచ్చే నెలలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు ఆఫీస్ బేరర్ల సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకున్నది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ప్రచారానికి సంబంధించిన అంశాలపై సవివరంగా చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరిలో చెలరేగిన హింస, సింఘు సరిహద్దులో ఎస్సీ యువకుడి హత్య తదితర అంశాలు భేటీలో ప్రధానంగా చర్చకు అవకాశం ఉన్నది. లఖింపూర్ ఖేరి హింసాకాండ విషయంలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామాకు విపక్షాలు బీజేపీపై ఒత్తిడి తెస్తున్నాయి. అలాగే దేశంలో కరోనాకు వ్యతిరేకంగా సాగుతున్న టీకా ప్రచారంపై చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.