బాలీవుడ్ కథానాయిక కంగనారనౌత్కు వివాదాలు కొత్తేమీ కాదు. ఎలాంటి భేషజాలకు తావులేకుండా నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుందీ అమ్మడు. గత కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ తీరుతెన్నులు, వారసుల ఆధిపత్యంపై నిరసన గళం వినిపిస్తున్న ఆమె తాజాగా అగ్ర హీరోలు అక్షయ్కుమార్, అజయ్ దేవ్గణ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ ఇద్దరు హీరోలు తన సినిమాలకు ఎప్పుడూ సపోర్ట్ చేయరని అసంతృప్తి వ్యక్తం చేసింది.
“అక్షయ్ కుమార్ ఫోన్ చేసి ‘తలైవి’ సినిమా బాగుందని మెచ్చుకుంటాడు. కానీ సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు రాడు. సోషల్మీడియాలో ట్రైలర్ను షేర్ చేయడం కూడా అతనికి ఇష్టం ఉండదు. కనీసం సినిమా గురించి ట్వీట్ కూడా చేయడు. ఇక అజయ్దేవ్గణ్ ఇతర తారల లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తారు. నా సినిమాలకు మాత్రం ఒప్పుకోరు. నేనుంటే తనకు పేరు రాదని భయపడతాడు’ అని కంగనారనౌత్ పేర్కొంది. సహచరుల సినిమాలకు మద్దతుగా నిలిచే విషయంలో తాను ముందుంటానని, ఫోన్ల ద్వారా కాకుండా బహిరంగంగానే ప్రమోట్ చేస్తానని కంగనారనౌత్ తెలిపింది.