సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘మసూద’. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. హారర్ డ్రామా కథతో దర్శకుడు సాయి కిరణ్ రూపొందించారు. ఈ సినిమా మంచి ఆదరణ పొందుతున్నదని చెబుతున్నారు హీరో తిరువీర్. ఆయన మాట్లాడుతూ…“మల్లేశం’, ‘పలాస’, ‘జార్జ్ రెడ్డి’ చిత్రాలు నాకు గుర్తింపు తీసుకొచ్చాయి. నా కెరీర్లో ఇప్పటిదాకా ఎక్కువగా విలన్, సైకో పాత్రల్లో నటిస్తూ వచ్చాను. ఇలాంటివి తప్ప మంచి పాత్రలు దొరకవా అనుకుంటున్న సమయంలో ఈ చిత్రంలో అవకాశం దక్కింది. ఈ సినిమాలో గోపి పాత్రలో నటించాను. నిజ జీవితంలోనూ నా వ్యక్తిత్వాన్ని పోలిన పాత్ర ఇది.
ఈ పాత్రతో నటుడిగా నాలో ఇంకో కోణం ఉందని ఇండస్ట్రీకి తెలిసింది. దిల్ రాజు లాంటి నిర్మాతలు నా పాత్ర గురించి మాట్లాడుతున్నారు. ఈ సక్సెస్ ఇచ్చిన ఆనందంతో నిద్రపట్టడం లేదు. విలన్, హీరో ట్యాగ్ తగిలించుకోవడం నాకు ఇష్టం లేదు. కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్లా అన్ని తరహా పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ప్రస్తుతం పరేషాన్ అనే సినిమా రిలీజ్కు రెడీగా ఉంది. దీంతో పాటు పారా హుషార్, మోక్షపటం అనే చిత్రాలు, వైజయంతీ సంస్థలో ఓ వెబ్ సిరీస్లో నటిస్తున్నా. డబ్బు కంటే మంచి స్క్రిప్ట్కే ప్రాధాన్యతనిస్తాను’ అని అన్నారు.