మారేడ్పల్లి, నవంబర్ 13: కోరికల్లో నిజాయితీ ఉంటే అవి నెరవేరే అవకాశాలు అధికంగా ఉంటాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమలత అన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన ఉంటే, కోర్టులకు వెళ్లే అవసరమే ఉండదని పేర్కొన్నారు. శనివారం సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ, మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ప్యాట్నీ సెంటర్లో నిర్వహించిన లీగల్ సర్వీసెస్ క్యాంపులో ఆమె మాట్లాడుతూ.. ఉచిత న్యాయసేవలు, చట్టాలపై అవగాహన, ప్రజలకు పథకాలు అందేలా కృషి చేస్తున్న న్యాయసేవాధికార సంస్థను అభినందించారు. రూ.2 కోట్ల విలువైన ఎస్సీ కార్పొరేషన్ రుణాలతోపాటు కులాంతర వివాహం చేసుకున్న 40 జంటలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భగవాన్ మహావీర్ వికలాంగ ట్రస్ట్ ఆధ్వర్యంలో 15 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందించారు. మహిళలకు సబ్సిడీ రుణాలు, నిరుద్యోగులకు సరుకు రవాణా వాహనాలు, ఆటోలు, దివ్యాంగులశాఖ ఆధ్వర్యంలో మూడు చక్రాల సైకిళ్లు, సబ్సిడీ రుణాలు, ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు కార్మికుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూ.6.5 లక్షలు చొప్పున పరిహారాన్ని అందించారు. మెటర్నిటీ రిలీఫ్ కింద లబ్ధిదారులకు రూ.30 వేలు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. హైదరాబాద్లో వ్యాక్సినేషన్ వేగంగా పూర్తి చేయించేందుకు కృషి చేసిన డీఎంహెచ్వో డాక్టర్ వెంకటిని అభినందించారు. కార్యక్రమంలో సివిల్, మెట్రో పాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చైర్మన్లు ప్రభాకర్రావు, జడ్జి సురేశన్, ఫస్ట్ అడిషనల్ కోర్టు జడ్జి ఎన్వీ నాథ్రెడ్డి, హైదారబాద్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగం నారాయణ, సీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు.