ఉడిపి: కర్నాటకలో విద్యార్థుల నిరసనలు హోరెత్తిస్తున్నాయి. ఉడిపి జిల్లాలోని కుందాపూర్లో ఉన్న గవర్నమెంట్ పీయూ కాలేజీలో గత కొన్ని రోజుల నుంచి ముస్లిం అమ్మాయిలు హిజబ్ ధరించి క్లాస్రూమ్లకు వస్తున్నారు. హిజబ్ లేకుండా క్లాస్కు రావాలని మేనేజ్మెంట్ ఆదేశించినా.. ఆ ముస్లిం అమ్మాయిలు మాత్రం తమ రూటు మార్చలేదు. దీంతో మరుసటి రోజు నుంచే ఆ కాలేజీలోని అబ్బాయిలు కాషాయ కండువాలను ధరించిన కాలేజీకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఉడిపి జిల్లాలో పరిస్థితులు నాటకీయంగా మారుతున్నాయి. ఇవాళ కూడా తలకు స్కార్ప్ను ధరించి అమ్మాయిలు కాలేజీకి వచ్చారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ప్రిన్సిపాల్ వారిని అడ్డుకున్నారు. క్లాస్రూమ్కు రావాలంటే కచ్చితంగా హిజబ్ తీసి రావాలని ఆ ప్రిన్సిపాల్ ఆదేశించారు.ఆ సమయంలో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. గతంలో ఆ అమ్మాయిలు హిజబ్ ధరించలేదని, గడిచిన 20 రోజుల నుంచి మాత్రమే వాళ్లు హిజబ్లో వస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ ఈ సందర్భంగా తెలిపారు.
మరోవైపు కర్నాటక హైకోర్టు ముందుకు ఈ కేసు వెళ్లింది. హిజబ్ ధరించిన అమ్మాయిలను క్లాస్రూమ్కు అనుమతించాలని కోర్టులో రెండు కేసులు దాఖలు చేశారు. హైకోర్టు వాటిని విచారణకు స్వీకరించింది. నిజానికి ఉడిపి కాలేజీలో మొదట్లో ఆరు మంది అమ్మాయిలు స్కార్ఫ్తో కాలేజీకి వచ్చారు. అయితే క్యాంపస్లో హెడ్స్కార్ఫ్ ఉన్నా సమస్య కాదు, కానీ క్లాస్రూమ్కు మాత్రం స్కార్ఫ్ లేకుండా రావాలని ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ ప్రకారమే తాము స్కార్ఫ్ ధరిస్తున్నట్లు ఆ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ కాలేజీలో ప్రతిష్టంభన మొదలైంది. ఇప్పుడు ఇదే సమస్య ఆ రాష్ట్రంలోని ఇతర కాలేజీలకు పాకింది. అబ్బాయిలు కాషాయ కండువాతో కాలేజీకి వెళ్లడం నిరసనలో భాగమైంది.