న్యూఢిల్లీ, మే 13: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ తాత్కాలికంగా నిలుపుచేశారు. ట్విట్టర్లో స్పామ్, ఫేక్ ఖాతాల సరియైన సంఖ్యను తెలుసుకునేందుకు తాను ప్రయత్నిస్తున్నానని, అందుకే టేకోవర్ లావాదేవీకి విరామాన్ని ప్రకటిస్తున్నట్టు మస్క్ తాజాగా ట్వీట్ చేశారు.
తమకు ప్రకటనల ఆదాయం సమకూర్చే 23 కోట్ల యాక్టివ్ యూజర్లలో నకిలీ/స్పామ్ ఖాతాల సంఖ్య 5 శాతంలోపుగానే ఉంటుందని మే 2న ట్విట్టర్ త్రైమాసిక నివేదికలో తెలిపింది. అయితే ఈ సంఖ్య 5 శాతంలోపే ఉంటుందా అన్న అనుమానాన్ని మస్క్ వ్యక్తం చేస్తూ, ఇంతకంటే ఎక్కువగా ఉండవచ్చని సూచనాప్రాయంగా అంచనా వేశారు. వాస్తవ వ్యక్తుల్ని అనుకరిస్తూ ట్విట్టర్లో దర్శనమిచ్చే ‘స్పామ్ బోట్స్’ సమస్యను పరిష్కరించాల్సి ఉందన్న అభిప్రాయాన్ని మస్క్ బహిరంగంగా వ్యక్తంచేస్తూవస్తున్నారు.
మస్క్ ప్రకటనతో అమెరికా స్టాక్ మార్కెట్లో టెస్లా, ట్విట్టర్ షేర్లు పరస్పర భిన్నమార్గంలో స్పందించాయి. ట్విట్టర్ షేరు 15 శాతం క్షీణించగా, మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా 6 శాతంపైగా పెరిగింది. ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే మస్క్ 8 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను విక్రయించారు.టెస్లా షేర్లను తనఖా చేసి, మిగిలిన మొత్తాన్ని సమీకరించే యోచనను ఆయన ఇప్పటికే వెల్లడించారు. ఈ షేర్ల భిన్న స్పందనకు ట్విట్టర్ లావాదేవీ జరగబోదన్న అంచనాలే కారణమని విశ్లేషకులు తెలిపారు.