ఐపీఎల్లో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఐదుసార్లు టైటిల్ చేజిక్కించుకున్న ముంబై ఇండియన్స్.. తాజా సీజన్లో బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది. మొదట బౌలర్లు రాణించడంతో లక్నోను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన రోహిత్ సేన.. ఆనక ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిలబడి ఎనిమిదో పరాజయాన్ని ఆహ్వానించింది! తాజా సీజన్లో ముంబైతో ఆడిన రెండో మ్యాచ్లోనూ సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్లో జట్టును ముందుండి నడిపిస్తే.. బౌలింగ్లో కృనాల్ పాండ్యా కీలక వికెట్లు పడగొట్టి లక్నోకు ఐదో విజయాన్ని కట్టబెట్టాడు!
ముంబై: ఈ సీజన్లో ముంబైకి ఏదీ కలిసి రావడం లేదు. లీగ్ దశ సగం పూర్తైనా.. బోణీ కొట్టేందుకు చకోర పక్షిలా ఎదురుచూస్తున్న రోహిత్ సేనకు నిరీక్షణ తప్పడం లేదు. ఐపీఎల్-15వ సీజన్లో ఆడిన ఎనిమిదో మ్యాచ్లోనూ నిరాశ పరిచిన ముంబై ఇండియన్స్.. ఆదివారం జరిగిన పోరులో లక్నో సూపర్జెయింట్స్ చేతిలో 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (62 బంతుల్లో 103; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సీజన్లో రెండో శతకంతో అదరగొట్టగా.. మిగిలినవాళ్ల నుంచి సారథికి సరైన సహకారం లభించలేదు. రాహుల్ ఒంటరి పోరాటం చేయగా.. డికాక్ (10), స్టొయినిస్ (0), కృనాల్ పాండ్యా (1), దీపక్ హుడా (10), ఆయుశ్ బదోనీ (14) విఫలమయ్యారు. మనీశ్ పాండే (22) కాసేపు రాహుల్కు అండగా నిలిచాడు.
ముంబై బౌలర్లలో పొలార్డ్, మెరిడిత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (39; 5 ఫోర్లు, ఒక సిక్సర్), తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ (38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఓ మోస్తరు లక్ష్యఛేదనలో రోహిత్ నిలకడ కనబర్చడంతో ఒక దశలో 49/0తో మెరుగైన దశలో నిలిచిన ముంబై.. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ (8), బ్రేవిస్ (3), సూర్యకుమార్ (7) ఘోరంగా విఫలమయ్యారు. రాహుల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా సోమవారం పంజాబ్తో చెన్నై తలపడనుంది.
లక్నో: 20 ఓవర్లలో 168/6 (రాహుల్ 103 నాటౌట్; పొలార్డ్ 2/8, మెరిడిత్ 2/40), ముంబై: 20 ఓవర్లలో 132/8 (రోహిత్ 39, తిలక్ 38; కృనాల్ 3/19, బదోనీ 1/6).