ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని పర్యాటక స్థలాలు, దేవాలయాలు పర్యాటకులు, భక్తులతో సందడిగా మారాయి. ఆదివారం సెలవు కావడంతో తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. మేడారం జాతర సమీపిస్తున్నందున భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని ఎత్తు బెల్లం, కుంకుమ సమర్పించారు. రేగొండ మండలంలోని బుగులోని జాతరకు భక్తులు పోటెత్తారు. వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగితేలారు. పర్యాటక ప్రాంతాలైన లక్నవరం, రామప్పను పరాటకులు సందర్శించి ప్రకృతిని ఆస్వాదించారు. – తాడ్వాయి/ వెంకటాపూర్/
గోవిందరావుపేట/ రేగొండ, నవంబర్ 21
మేడారంలో భక్తుల సందడి
మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ర్టాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. మొదటగా జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేసి గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవార్లకు యాటపోతులు, కోళ్లను బలిచ్చి గద్దెల పరిసరాల్లో వంటలు చేసుకుని బంధుమిత్రలతో కలిసి విందుభోజనాలు చేశారు.
రామప్ప శిల్పాలు అద్భుతం
నాల్గో రోజూ మొక్కులు
మండలంలోని బుగులోని జాతర ఆదివారం కోలాహలంగా మారింది. నాల్గోరోజు వేంకటేశ్వర స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో పాండవుల గుట్టలు మార్మోగాయి. వివిధ శాఖల ఆధికారులు, ప్రజా ప్రతినిధులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ, అధికారులు పర్యవేక్షించారు.