న్యూఢిల్లీ, డిసెంబర్ 28: దేశంలో అత్యంత ధనికుడైన ముకేశ్ అంబానీ ఒక సంచలన ప్రకటన చేశారు. తమ రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్లో తనతో సహా సీనియర్లు నాయకత్వ పగ్గాల్ని యువతకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రిలయన్స్ వారసత్వ ప్రణాళిక గురించి ఇప్పటివరకూ మాట్లాడని ముకేశ్ అంబానీ (64) మంగళవారం రిలయన్స్ ఫ్యామిలీ డే కార్యక్రమంలో ప్రసంగిస్తూ ‘రిలయన్స్ ప్రస్తుతం నాయకత్వ మార్పు జరిగే ప్రక్రియలో ఉంది’ అని చెప్పారు. అంబానీకి ముగ్గురు పిల్లలు-కవలలైన అకాశ్, ఈషాలు, అనంత్- ఉన్నారు. రానున్న సంవత్సరాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలో బలమైన, పేరొందిన భారత బహుళజాతి సంస్థగా ఆవిర్భవిస్తుందని ముకేశ్ అన్నారు.
పెద్ద కలల్ని, అసాధ్యంగా కన్పించే లక్ష్యాల్ని సాధించాలంటే సరైన నాయకత్వం అవసరమని, రిలయన్స్ ఇప్పుడు తన జమానాకు చెందిన సీనియర్ల నుంచి నాయకత్వాన్ని తదుపరి తరానికి అప్పగించే ప్రక్రియలో ఉందన్నారు. రిలయన్స్లో నాయకత్వ నైపుణ్యంగల యువత ఉందని, వారికి తాము మార్గదర్శకత్వం వహించి, బాధ్యతల్ని అప్పగించి, వారు తమకంటే మెరుగ్గా పనితీరు కనపరుస్తుంటే అభినందించడమే తమ పని అని ఆయన వివరించారు. ‘రిలయన్స్ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చగల తదుపరి తరం నాయకులు..అకాశ్, ఇషా, అనంత్లు అనడంలో తనకెటువంటి సందేహం లేదన్నారు. అంబానీ తన ప్రసంగంలో ఇషా (ఆనంద్ పిరమల్), అకాశ్ (శ్లోక) జీవిత భాగస్వాముల పేర్లతో పాటు అనంత్కు జీవిత భాగస్వామి కాబోతున్న రాధిక పేరును ప్రస్తావించారు.