న్యూఢిల్లీ, మార్చి 18: కొవిడ్-19 చికిత్సకు ఒక ఓరల్ ఔషధాన్ని హైదరాబాదీ ఫార్మా సంస్థ ఎంఎస్ఎన్ గ్రూప్ దేశంలో ప్రవేశపెట్టనుంది. అంతర్జాతీయ కంపెనీ ఫైజర్ కరోనావైరస్ డ్రగ్ ప్యాక్స్లోవోయిడ్ జెనెరిక్ వెర్షన్ తయారీ, పంపిణీకి ఆ సంస్థతో లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఎంఎస్ఎన్ శుక్రవారం తెలిపింది. నిర్మాట్రెల్విర్, రిటోనావిర్ ట్యాబ్లెట్ల కాంబినేషన్తో కూడిన ఈ యాంటివైరల్ గోళీ అమెరికాతో పాటు పలు ఇతర దేశాల్లో కొవిడ చికిత్సకు ఓరల్ ఔషధంగా ఆమోదం పొందిందని, డీసీజీఐ అనుమతించినంతనే మన దేశంలో ప్యాక్సావిడ్ బ్రాండ్నేమ్తో ఈ ట్యాబ్లెట్లను విడుదల చేస్తామని ఎంఎస్ఎన్ వివరించింది. ప్రిస్క్రిప్షన్పై లభించే ప్యాక్సావిడ్ కాంబినేషన్ ప్యాక్లో రెండు 150 ఎంజీ నిర్మాట్రెల్విర్ ట్యాబ్లెట్లు, ఒక 100 ఎంజీ రిటోనావిర్ ట్యాబ్లెట్ ఉంటాయన్నది. ఈ ప్యాక్ ధరను తదుపరి ప్రకటిస్తామని పేర్కొంది. తమ అత్యాధునిక యూఎస్ఎఫ్డీఏ, యూరోపియన్ యూనియన్ ఆమోదిత ప్లాంటులో వీటిని ఉత్పత్తి చేస్తామని సంస్థ తెలిపింది.