చెన్నై: రాబోయే ఐపీఎల్-2021 కోసం మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. మిగతా ఫ్రాంఛైజీల కన్నా ముందే ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభించిన చెన్నై వినూత్నంగా ప్రాక్టీస్ చేస్తోంది. రియల్ మ్యాచ్లో ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా ఆ సమయంలో ఎలా ఆడాలనేదానిపై ఇప్పటి నుంచే ఆటగాళ్లను ధోనీ సన్నద్ధం చేస్తున్నాడు. భాగస్వామ్యాలు నెలకొల్పడం, తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు రాబట్టడం, ఆఖర్లో ధనాధన్ బ్యాటింగ్ చేయడం లాంటి వాటిపై ప్రధానంగా టీమ్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టింది.
రెగ్యులర్ ప్రాక్టీస్కు భిన్నంగా తాము సాధన చేస్తున్నట్లు ఆ జట్టు ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. టాప్ ప్లేయర్లు సురేశ్ రైనా, రవీంద్ర జడేజా ఇంకా జట్టుతో కలవాల్సి ఉంది. రైనా ఈనెల 24లోగా క్యాంప్లో చేరనుండగా జడేజా ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో కోలుకుంటున్నాడు. ఈ వారం చివర్లో జడ్డూ కూడా టీమ్తో కలవనున్నట్లు సీఎస్కే టీమ్ మేనేజ్మెంట్ పేర్కొంది.