‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా పరిచయమవుతున్న డివోషనల్ థ్రిల్లర్ ‘ఎల్లమ్మ’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచింది. అయితే ఈ సినిమాలో కథానాయిక ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.
సాయిపల్లవి, కీర్తి సురేష్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నాయికగా ఖరారయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. ఇప్పటికే ఆమెతో చిత్రబృందం సంప్రదింపులు జరిపిందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. గ్రామదేవతల చుట్టూ సాగే కథాంశమిదని, ఆధ్యాత్మిక, యాక్షన్ అంశాల కలబోతగా మెప్పిస్తుందని సమాచారం. మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాకా’లో కూడా నటిస్తుందని తెలిసింది.