బీర్కూర్, మార్చి 13: సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు ఆదివారం మృత్యుంజయ హోమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్లోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఈ హోమాన్ని జరిపించారు. స్పీకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని హోమాన్ని జరిపించినట్టు తెలిపారు. రాష్ట్రమే కాకుండా దేశ ప్రజలు సైతం కేసీఆరే కావాలనుకుంటున్నారని స్పీకర్ పేర్కొన్నారు.
మహబూబ్నగర్టౌన్, మార్చి 13: సీఎం కేసీఆర్ క్షేమం కోసం ఆదివారం మహబూబ్నగర్లోని అబ్దు ల్ ఖాదర్ దర్గాలో టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం నిరంతరం కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ వందేండ్లు ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశామన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం అవసరం ఉన్నదని వారు తెలిపారు.