హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): దేశాన్ని తప్పుదోవ పట్టించేవిధంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగం కోసం పోరాడుతున్న తమపై చట్టసభలో ఎంపీ అర్వింద్ ఆరోపణలు చేయడం అర్థరహితమని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్రం వడ్లు కొనబోమని చెప్పిన నేపథ్యంలో వరి పంట వేయొద్దని తాము రైతులకు చెప్తుంటే, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం వరి వేయాలని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎఫ్సీఐ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు.
యాసంగి ధాన్యం కొంటరా? కొనరా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా ప్రశ్నించినా, కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై తాము పార్లమెంటులో ఆందోళనకు దిగితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాత కథనే వినిపించారని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు లోక్సభలో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతాంగ సమస్యలను సభ ద్వారా కేంద్రానికి వివరించేందుకు తాము ప్రయత్నిస్తే, తమకు కనీసం మైక్ కూడా ఇవ్వలేదని నామా ఆవేదన వ్యక్తం చేశారు . అదే సమయంలో బీజేపీ ఎంపీలకు కేవలం ఆరోపణలు చేసేందుకు మైక్ ఇవ్వడం శోచనీయమని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన సమాధానం ఇవ్వకపోతే తమ నిరసనను ఉధృతం చేస్తామని చెప్పారు.