హైదరాబాద్ : ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్లో పర్యటించింది. ఈ కమిటీలో పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా సైతం సభ్యురాలుగా ఉన్నారు. ఈ సందర్భంగా కమిటీకి రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం కమిటీని మంత్రి కేటీఆర్ సత్కరించారు. ఈ క్రమంలో మహువా మోయిత్రాకు మంత్రి కేటీఆర్ కేటీఆర్ పోచంపల్లి చీరను కానుకగా అందజేశారు.
ఆ చీరను మంగళవారం ఆమె ధరించగా.. ఆ చీరలో మెరిసిపోయారు. ‘ఇండియన్ హ్యాండ్లూమ్ రాక్. తెలంగాణకు చెందిన మోస్ట్ బ్యూటిఫుల్ పోచంపల్లి కాటన్ చీరను ధరించాను. ఇటీవల ఐటీ కమిటీ టూర్లో కేటీఆర్ బహూకరించారు’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ ‘తెలంగాణ పోచంపల్లి చేనేతలను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. మా బహుమతి మీకు నచ్చినందుకు సంతోషం’ అంటూ ట్వీట్ చేశారు.