హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): అన్ని రంగాల్లో రాష్ట్రంపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నదని, తెలంగాణను శత్రువుగా చూస్తున్నదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు ధ్వజమెత్తారు. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీల నేతలతో వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేకే, నామా మాట్లాడుతూ, కేంద్రం నుంచి రాష్ర్టానికి దక్కాల్సిన ప్రయోజనాల విషయంలో కేంద్రం తీరును తప్పుపట్టారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పురోగమిస్తున్న తెలంగాణకు కేంద్రం సహకరించాల్సింది పోయి వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. ఇది సరైన విధా నం కాదని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన హామీలతోపాటు అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేసిన సిఫారసులను సైతం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అన్ని రాష్ర్టాలకు మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తూ తెలంగాణకు మాత్రం మొండిచేయి ఇచ్చిందని విమర్శించారు. ‘తెలంగాణను ఎందుకు శత్రువుగా చూస్తున్నారు? తెలంగాణ పట్ల కేంద్రం విరోధంతో ఎందుకు వ్యవహరిస్తున్నది?’ అని నిలదీశారు. పెండింగ్లో ఉన్న జీఎస్టీ, ఐజీఎస్టీ నిధులను విడుదల చేయటంలేదని గుర్తుచేశారు. ధాన్యం సేకరణకు సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా ప్రధానికి సూచించారు. బాయిల్డ్ రైస్ సమస్యను తెలంగాణ, ఒడిశాతోపాటు అనేక రాష్ర్టాలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
ఈ విషయంలో ఆయా రాష్ర్టాల రైతాంగం ఆందోళనలో ఉన్నదని వివరించారు. పార్లమెంట్లో తమకు మెజారిటీ ఉన్నదన్న భావనతో ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్రం కక్షగట్టిందని, కేంద్రాన్ని నిలదీస్తున్న పార్టీల నేతలపై ఐటీ, ఈడీ సోదాలు చేయిస్తున్నదని మండిపడ్డారు. మునుపెన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ను కూడా ఇష్టారాజ్యంగా వాడుకోవటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, సమాఖ్య స్ఫూర్తికి మంచిది కాదని హితవు పలికారు. కొన్ని సందర్భాల్లో ప్రివిలేజ్ కమిటీలను సైతం కేంద్రం అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నదని కేకే, నామా ధ్వజమెత్తారు. పార్లమెంట్ను, కేంద్ర ప్రభుత్వ సంస్థలను తక్కువ చేసి మాట్లాడటం లేదని, తమ ఆవేదనను మాత్రమే వెల్లడిస్తున్నామని వారు స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం తమ అవసరాల కోసం ఆయా సంస్థలను వాడుకోవటం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై చర్చించి, అనువైన పరిష్కారాలను వెతికేందుకు పార్లమెంట్ వేదికగా ఉండాలని సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. పెగాసస్ స్పైవేర్ సమస్య జాతీయ భద్రతా అంశమని పేర్కొన్నారు.
విభజన హామీలపై..
రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేని ఈ సందర్భంగా కేకే, నామా గుర్తుచేశారు. గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం ఏర్పాటు సహా అనేక హామీలను సమావేశంలో ప్రస్తావించారు. వీటితోపాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన రూ.450 కోట్ల బకాయిలు, జిల్లాకో నవోదయ పాఠశాల, హైదరాబాద్లో ఐటీఐఆర్ ఇలా అనేక అంశాలపై తామెన్నిసార్లు కేంద్రానికి విన్నవించినా వాటిపై స్పందన లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వీటిపై కనీసం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని చెప్పారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఉపాధి కల్పనకు కేంద్రం ఎటువంటి చర్యలూ తీసుకోవటంలేదని కేకే, నామా ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజే కేంద్ర ప్రభుత్వానికి నిరసన సెగ తాకింది. సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. అయితే.. రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్ష, నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దని, గట్టిగా పోరాడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలకు సూచించిన విషయం తెలిసిందే. రాష్ర్టానికి న్యాయబద్ధంగా కేంద్రం నుంచి రావాల్సినవి ఏవీ రావడం లేదని, ఈ విషయంలో కేంద్రాన్ని పార్లమెంట్ వేదికగా నిలదీయాలని కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు.
విభజన హామీలు, ఆర్థిక సంఘం సిఫారసులు, కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ నిధులు సహా మొత్తం 38 అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎంపీలకు మార్గదర్శనం చేశారు. ఈ నేపథ్యంలో తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా 11 రోజులపాటు రాజ్యసభ, లోక్సభలను టీఆర్ఎస్ స్తంభింపజేసిన విషయం తెలిసిందే. రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని చాటేందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.