జగిత్యాల, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆయన ఓ ఎంపీ. పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన జగిత్యాలలో శుక్రవారం పర్యటన అట్టర్ఫ్లాప్ అయ్యింది. నాలుగు కార్యక్రమాలకు కనీసం ఐదు వందల మంది కార్యకర్తలను హాజరుకావాలని కోరితే, పది మంది కూడా రాలేదు. ‘ఇదేం ఆర్గనైజింగ్?.. ఇలాగే పనిచేస్తరా?.. నియోజకవర్గ బూత్కమిటీ అధ్యక్ష, కార్యదర్శులను సమావేశానికి రప్పించాలని చెప్తే, పట్టుమని 10 మంది కూడా రాలేదు.. మీరేం పనిచేస్తున్నరు, ఇదేం పద్ధతి’ అంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ జగిత్యాల జిల్లా బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. నియోజకవర్గంలోని దాదాపు 224 బూత్ అధ్యక్ష, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, కొత్తగా కమిటీలకు ప్రణాళికలు తయారుచేద్దామని చెప్పినట్టు సమాచారం. బీజేవైఎం శిబిరం ప్రారంభోత్సవానికి వచ్చేసరికి సమావేశంలో 50 మందిలోపు హాజరయ్యారు. పరువు పోతుందనే ఉద్దేశంతో అక్కడి నుంచి మీడియాను వెళ్లిపోవాలని కోరారు. తర్వాత జిల్లా నాయకత్వంతో పాటు, పట్టణ శాఖ నాయకత్వంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. జగిత్యాల నియోజకవర్గ బీజేపీ క్యాడర్ ఐదువర్గాలుగా చీలిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకులతోపాటు, సీనియర్లు, జూనియర్ల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నట్టు సమాచారం.