వేదాంతు… ఆన్లైన్ విద్య గురించి తెలిసిన వాళ్లకు బాగా పరిచయం ఉన్న పేరే. విజ్ఞానం అన్న అర్థాన్నిచ్చే ‘వేదం’, నెట్వర్క్ అనే అర్థాన్నిచ్చే ‘తంతు’ అనే రెండు సంస్కృత పదాల కలయికే.. వేదాంతు. ఇంటర్నెట్ వేదికగా విజ్ఞానంతో అనుసంధానం కావడం అన్నమాట. ఏడేళ్ల కిందట మొదలైన ఈ స్టార్టప్ ఈ ఏడాది వందకోట్ల డాలర్ల యూనికార్న్ కంపెనీల జాబితాలోకి చేరింది. ఆ స్ఫూర్తిదాయక ప్రస్థానం…
నలుగురు యువకులు. అందరూ ఐఐటీల్లో చదువుకున్నారు. వారిలో ఒకరు వంశీకృష్ణ. తెలుగువాడే. ఐఐటీ ముంబయి నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నాడు. అప్పటికే చేస్తున్న లక్షణమైన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు ఐఐటీ రూర్కీ నుంచి ఇంజినీరింగ్ పూర్తిచేసిన పులకిత్ జైన్, సౌరభ్ సక్సేనా, ఆనంద్ ప్రకాశ్ జత కలిశారు. వారికీ ఆ ఉద్యోగాలు మొదటివే. నలుగురూ కలిసి ఏదైనా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతవరకైతే సులభంగానే జరిగిపోయింది. ఏం చేయాలన్నదే అసలు సమస్య.
బర్నాలాలో మేధోమథనం
పంజాబ్లో ఓ చిన్న పట్టణం.. బర్నాలా. వంశీ బృందంలో ఒకరైన ఆనంద్ ప్రకాశ్ అక్కడే ఓ రసాయనాల పరిశ్రమలో పనిచేసేవాడు. అలా అవకాశాలను అన్వేషించడానికి మిత్రబృందం బర్నాలాలో సమావేశం అయ్యారు. వీళ్లు ఐఐటీలో చదువుకున్నారని స్థానికులకు తెలిసింది. అంతే, తమ ప్రశ్నలకు జవాబులు చెప్పాలని చుట్టుముట్టేయడం ప్రారంభమైంది. ఆ చిన్న అనుభవమే వారికి ఓ బ్రహ్మాండమైన ఐడియాను ఇచ్చింది. అలా, 2006 ఏప్రిల్లో బర్నాలా కేంద్రంగా ‘లక్ష్య’ ఆఫ్లైన్ ట్యూషన్ సెంటర్ మొదలైంది. మొత్తానికి ఐఐటీలో పోదిచేసుకున్న ధైర్యం, దృఢ నిశ్చయంతో ఆ నలుగురు ఇంజినీర్లూ తమ రాత మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఏడాది శిక్షణ ఇచ్చిన 30 పైచిలుకు విద్యార్థుల్లో దాదాపు డజను మందికి ఐఐటీల్లో సీట్లొచ్చాయి. అది మొదలు ఆరేళ్లపాటు లక్ష్య ప్రయాణం ఎదురులేకుండా సాగిపోయింది. వ్యాపారాన్ని విస్తరించుకుంటే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. కానీ, ఆఫ్లైన్ వ్యాపారానికి పరిమితి ఉంటుంది. దాంతో పంజాబ్లోనే ఓ అయిదు ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లు తెరిచారు. నాణ్యమైన ఉపాధ్యాయులు దొరకడం, దొరికినా వారిని మారుమూల ప్రాంతాలకు రప్పించడం పెద్ద సవాలుగా మారింది. ఇక, లాభం లేదనుకొని 2012లో లక్ష్యను ‘ఎమ్టీ ఎడ్యుకేర్’ సంస్థకు 30 కోట్ల రూపాయలకు అమ్మేశారు. ‘ఇదెంతో లాభదాయకమైన నిష్క్రమణ’ అంటాడు వంశీ.
వేదాంతు స్థాపన ఇలా..
ఆన్లైన్లో ప్రత్యక్ష బోధన దిశగా మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు ఆ మిత్రులు. ఫలితమే 2014లో ‘వేదాంతు’ ప్రారంభం. కానీ, అడుగడుగునా అవరోధాలే. అప్పటికి ఆన్లైన్ తరగతులు భారతదేశంలో పెద్దగా ప్రాచుర్యంలో లేవు. రెండోది, అప్పటికే స్మార్ట్ఫోన్ బూమ్ మొదలైనా, ఇంటర్నెట్ వేగం అన్నది ఓ ఆటంకంగా నిలిచింది. అయితేనేం, ఇన్వెస్టర్లు కూడా ఇందులోని లాభదాయకతను గుర్తించారు. వేదాంతుకు టైగర్ గ్లోబల్ నుంచి 50 లక్షల డాలర్ల పెట్టుబడి లభించింది. 2020లో కరోనా మహమ్మారి పంజా విసిరింది. ప్రజల కదలికలపై ఆంక్షలు మొదలయ్యాయి. ఈ నిర్ణయం కూడా వేదాంతుకు కలిసొచ్చింది. వ్యాపారం అమాంతంగా పెరిగింది. 2018 ఆర్థిక సంవత్సరంలో కేవలం 5.3 కోట్ల రూపాయల రెవెన్యూ నుంచి, 2020 ఆర్థిక సంవత్సరానికి 35.8 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు ఆ విలువ దాదాపు 480 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఏడాది సెప్టెంబర్లో ఎబీసీవరల్డ్ ఏసియా నాయకత్వంలో వేదాంతు 742.2 కోట్లు సమీకరించుకుంది. దీంతో, వేదాంతు ఐదో ఎడ్ టెక్ యూనికార్న్గా అవతరించింది. దేశవ్యాప్తంగా ఉన్న 10,000కుపైగా ప్రాంతాల్లో వేదాంతు ఉపాధ్యాయుడి పాత్ర పోషిస్తున్నది. ‘కలల్ని నిజం చేసుకోవడం మీదే దృష్టిపెడితే ఏదీ అసాధ్యం కాదు’ అంటాడు తెలుగు బిడ్డ వంశీ.