రెబ్బెన, అక్టోబర్ 17: బతుకమ్మ, దసరా పండుగల కోసం పుట్టింటికి వచ్చిన ఓ మహిళ తిరిగి మెట్టినింటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమెతోపాటు కొడుకు దుర్మరణం చెందారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని గంగాపూర్ సమీపంలో ఆదివారం చోటుచేసుకున్నది. పెంచికల్పేట్ మండలం చెడ్వాయి గ్రామానికి చెందిన వెన్నంపల్లి సంగీత(27) తన ఇద్దరు కుమారులు అఖిల్(7), సిద్దూతో కలిసి బతుకమ్మ, దసరా పండుగల కోసం మంచిర్యాలలోని పుట్టింటికి వచ్చింది. ఆదివారం ఉదయం తన తమ్ముడు శివకుమార్ బైక్పై పిల్లలతోపాటు తిరిగి చెడ్వాయికి బయలుదేరింది. గంగాపూర్ కమాన్ దాటిన తర్వాత.. శ్రీరామ కాలనీ నుంచి బైక్పై వస్తున్న డెలివరీ బాయ్.. శివకుమార్ బైక్ను ఢీకొట్టాడు. దీంతో శివకుమార్తోపాటు సంగీత, ఆమె కుమారులు అఖిల్, సిద్దు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో కాగజ్నగర్ ఎక్స్ రోడ్ వైపు నుంచి తాండూర్ వైపు వెళ్తున్న లారీ సంగీత, అఖిల్పై నుంచి వెళ్లింది. దీంతో సంగీత అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108లో మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో అఖిల్ మృతి చెందాడు. శివకుమార్, సిద్దూ చికిత్స పొందుతున్నారు.