హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో మరిన్ని కరోనా కొత్త వేరియంట్లు తప్పవని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి పరిశీలిస్తే ఒక వేరియంట్ నుంచి మరో వేరియంట్ పుట్టడానికి ఆర్నెల్ల సమయం పడుతున్నదని, ఆ లెక్కన జూన్ లేదా జూలైలో కొత్త వేరియంట్ వచ్చే అవకాశం ఉన్నదని వెల్లడించారు. వైరస్ తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో మళ్లీ నిర్లక్ష్యం మొదలైందని, వైరస్ పూర్తిగా తొలగిపోలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ‘కొత్త వేరియంట్ రావటం పక్కా. కానీ దాని తీవ్రతపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. అది వేవ్లా వస్తుందా? లేదా? అన్నదీ అంచనా వేయలేం. ఏదైనా వైరస్ మ్యుటేషన్ చెందటం సర్వసాధారణం. కరోనా విషయంలోనూ అది జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తు తం వైరస్ తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యం చేస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. సాధ్యమైనంత వరకు ప్రజ లు కరోనా నియమాలు పాటించాల్సిందే. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కు పెట్టకోవడం మర్చిపోవద్దు. చేతులకు శానిటైజర్, భౌతిక దూరం తప్పనిసరి. మరికొంత కాలం ఈ కరోనా నియమాలు పాటించాల్సిందే’నని డాక్టర్ రాజారావు స్పష్టం చేశారు.