న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశంలో రిటైల్ సేల్స్ ఊపందుకుంటున్నాయి. నిరుడు మార్చితో పోల్చితే గత నెలలో 28 శాతం పుంజుకున్నట్టు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) తెలియజేసింది. తమ తాజా రిటైల్ వ్యాపార సర్వేలో అన్ని రంగాల్లో అమ్మకాలు పెరిగినట్టు తేలిందని వెల్లడించింది. కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో మార్కెట్ కార్యకలాపాలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయని రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లోనూ ఇదే వృద్ధి నమోదు కాగలదన్న విశ్వాసం రిటైల్ వ్యాపారుల్లో కనిపిస్తున్నదని చెప్పారు.
పశ్చిమాది రాష్ర్టాల్లో అత్యధికంగా రిటైల్ సేల్స్ గత నెల 37 శాతం పెరిగాయని తాజా సర్వే స్పష్టం చేసింది. ఆ తర్వాత ఉత్తరాది రాష్ర్టాల్లో 28 శాతం, తూర్పు రాష్ర్టాల్లో 26 శాతం, దక్షిణాది రాష్ర్టాల్లో 21 శాతం చొప్పున పెరుగుదల కనిపించినట్టు చెప్పింది. ఈ క్రమంలోనే కరోనాకు ముందున్న 2019 మార్చి అమ్మకాలతో చూస్తే.. ఈ ఏడాది మార్చిలో 12 శాతం పెరుగుదల ఉందని రాయ్ ఈ సందర్భంగా పేర్కొన్నది.
రిటైల్ అమ్మకాల్లో కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తూత్పత్తులదే హవా. అత్యధికంగా వీటి విక్రయాల్లో 45 శాతం వృద్ధి కనిపించింది. ఆ తర్వాత ఫర్నీచర్-ఫర్నీషింగ్, ఫుడ్-కిరాణా సేల్స్ 26 శాతం చొప్పున పెరిగాయి. క్రీడా ఉత్పత్తులు, దుస్తులు, వస్ర్తాల విభాగాల్లోనూ 26 శాతం వృద్ధి ఉన్నది. పాదరక్షల అమ్మకాలు 24 శాతం పెరిగితే, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ విభాగంలో 21 శాతం వృద్ధి నమోదైంది.