మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యం: మోదీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూపొందించిన రూ.100 లక్షల కోట్ల జాతీయ మాస్టర్ ప్లాన్ ‘పీఎం గతి శక్తి’ని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. బహుముఖ అనుసంధానంతో రవాణా వ్యయాన్ని తగ్గించడం, సామర్థ్యాన్ని పెంచడం ఈ ప్రణాళిక లక్ష్యమని మోదీ తెలిపారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేందుకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తాయని చెప్పారు. దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు జీడీపీలో 13 శాతంగా ఉందని, ఇది ఎగుమతుల్లో పోటీతత్వంపై ప్రభావం చూపుతున్నదని పేర్కొన్నారు. ఈ వ్యయాన్ని తగ్గించడం, సమయాన్ని ఆదా చేయడమే లక్ష్యమని, తద్వారా పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్ను మారుస్తామని చెప్పారు. వచ్చే నాలుగేండ్లలో 200కు పైగా విమానాశ్రయాలు, హెలిప్యాడ్లు, వాటర్ ఏరోడ్రమ్స్ను నిర్మిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్య ధోరణితో ప్రజల సొమ్ముకు ‘అవమానం’ జరిగిందన్నారు.