సీవీసీ, సీబీఐలను ఉద్దేశించి ప్రధాని మోదీ
కుషీనగర్/కేవడియా, అక్టోబర్ 20: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అవినీతి తగ్గిందని ప్రధాని మోదీ అన్నారు. అవినీతిని పారదోలడం సాధ్యమేనని ప్రజల్లో తాము విశ్వాసం కల్పించినట్టు చెప్పారు. అవినీతి నిర్మూలనపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందన్నారు. గుజరాత్లోని కేవడియాలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ), సీబీఐని ఉద్దేశించి వర్చువల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. దేశాన్ని, ప్రజలను మోసం చేసినవారు ఎంతటి శక్తిమంతులైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రపంచంలో వారికి ఎక్కడా ఆశ్రయం దొరకవద్దని పేర్కొన్నారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్లోని కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోదీ బుధవారం ప్రారంభించారు. శ్రీలంక నుంచి బౌద్ధ భిక్షువులతో బయల్దేరిన విమానం ఉదయం 9 గంటలకు కుశీనగర్లో దిగింది. కుశీనగర్లో బుధవారం నిర్వహించిన అభిధమ్మ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ‘భారత రాజ్యాంగానికి బుద్ధుడే స్ఫూర్తి’ అని అన్నారు.