‘ఇవే నాకు తొలి ప్రత్యక్ష ఎన్నికలు… తొలిసారే నేరుగా శాసనమండలికి పోటీ చేసే అవకాశం లభించింది. తొలి ఎన్నికల్లోనే ఘనవిజయం చాలా సంతోషానిస్తున్నది. ఈ సంతోషానికి కారణమైన పార్టీ అధినేత కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాను. ఎన్నికల్లో యువనేత కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి వెన్నంటి ఉండి నడిపించారు. ఈ గెలుపు కూడా కేసీఆర్కే అంకితం. ఎమ్మెల్సీగా ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో భాగస్వామిని అవుతా. స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తూనే నాగార్జునసాగర్ అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు సాగుతా. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు’ అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి మంకెన చిన కోటిరెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో వివరించారు.
నమస్తే : ఈ ఎన్నికల్లో ఘన విజయంపై మీ ఫీలింగ్ ?
కోటిరెడ్డి : ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీనే నాకు కొత్త. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడైనా తెరవెనకే ఉండి అభ్యర్థుల విజయానికి కృషి చేశా. కానీ తొలిసారిగా పోటీ చేసే అవకాశం లభించింది. సాగర్ ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు సీఎం కేసీఆర్ నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఎన్నికల్లోనూ సంపూర్ణ సహకారం అందించారు. ఈ విజయం ఆయనకే అంకితం. కేసీఆర్కు జీవితాతం రుణపడి ఉంటాను. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఘనవిజయం సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.
నమస్తే : మీ విజయానికి దోహదపడ్డ అంశాలేమిటి.?
కోటిరెడ్డి : ఈ గెలుపు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీలోని ప్రతి ఒక్కరిదీ. అభ్యర్థిని ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు అందరూ వెన్నుతట్టి నిలిచారు. ముఖ్యంగా పార్టీ యువనేత కేటీఆర్ మార్గదర్శనంలో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి అన్నీ తానై నడిపించారు. మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా, ప్రభుత్వ విప్ సునీతా మహేందర్రెడ్డితో పాటు జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలంతా సంపూర్ణ సహకారం అందించారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నేతలు, క్యాడరంతా నా గెలుపులో కీలకపాత్ర పోషించారు. నల్లగొండ జిల్లా గులాబీ ఖిలాగా మరోసారి నిరూపితమైంది.
నమస్తే : జిల్లా అభివృద్ధిలో మీ పాత్ర ఎలా ఉండబోతున్నది?
కోటిరెడ్డి : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, ఉమ్మడి జిల్లా ప్రతినిధిగా అభివృద్ధిలో సంపూర్ణ భాగస్వామిని అవుతా. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగుతున్న అభివృద్ధిని జిల్లా ప్రజలకు చేరువ చేసేందుకు నా వంతు పాత్ర పోషిస్తా. మంత్రి జగదీశ్రెడ్డితో పాటు జిల్లా ప్రజాప్రతినిధులందరితో కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తా. సీఏం కేసీఆర్ నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకునేందుకు కృషి చేస్తా. భవిష్యత్తులోనూ ఏ బాధ్యత అప్పజెప్పినా సమర్థవంతంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తా. సొంత ప్రాంతమైన నాగార్జునసాగర్ అభివృద్ధిలోనూ కలిసికట్టుగా ముందుకు సాగుతాం.
నమస్తే : స్థానిక సంస్థల బలోపేతంపై ఎమ్మెల్సీగా ఏం చెప్తారు..?
కోటిరెడ్డి : స్థానిక సంస్థల ప్రతినిధిగా నన్ను గెలిపించారు. నాకు ఓటేసిన స్థానిక ప్రజాప్రతినిధులందరికీ మరోసారి కృతజ్ఞతలు. స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ చిత్తుశుద్ధితో ఉన్నారు. సమస్యలపై ప్రభుత్వపరంగా నా వంతు ప్రయత్నం చేస్తా. స్థానిక ప్రజాప్రతినిధులకు గుర్తింపు, తగిన గౌరవం పెంపు కోసం కూడా శాయశక్తులా కృషి చేస్తా.